క్రైమ్ మిర్రర్ : మొరాకో-స్పెయిన్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు విషాదానికి దారితీశాయి. భారీ సంఖ్యలో వలసదారులు స్పెయిన్ భూభాగమైన సియుటాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. గత 24 గంటల్లో మొరాకో నుంచి దాదాపు 60 వేల మంది వలసదారులు ఒకేసారి సియుటాలోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో సరిహద్దు కంచెలను దాటే ప్రయత్నంలో జరిగిన తొక్కిసలాటతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు సముద్ర మార్గంలో ప్రమాదానికి గురై మృతి చెందారు.
ఈ ఘటనల్లో ఇప్పటివరకు 41 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. పరిస్థితులు అదుపు తప్పే స్థాయికి చేరుకోవడంతో స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ స్వయంగా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మానవ అక్రమ రవాణా ముఠాలు యువకులను మభ్యపెట్టి ప్రమాదకర ప్రయాణాలకు ప్రేరేపిస్తున్నాయని స్పెయిన్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేసేందుకు భారీ సంఖ్యలో సైనిక బలగాలు, డ్రోన్లు, ప్రత్యేక బృందాలను మోహరించారు. స్పెయిన్ భద్రతా దళాలు దాదాపు 30 వేల మంది వలసదారులను తిరిగి మొరాకో సరిహద్దు వైపు పంపించినట్లు సమాచారం. సరిహద్దు పరిస్థితులపై అధికారులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.
also read : జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడి.. వలస కూలీలపై కాల్పులు, ఒకరి మృతి
