-
వచ్చే ఏడాది మార్చితో రెండు స్థానాలు ఖాళీ
-
ఆరు నెలల ముందు నుంచే ఎన్నికల సన్నాహాలు
-
ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పార్టీలు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మరో ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. పట్టు నిలుపుకునేందుకు కాంగ్రెస్.. పూర్వ వైభవం కోసం భారత రాష్ట్ర సమితి.. బలమైన ఉనికి చాటుకునేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు ప్రారంభించాయి.
ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. కాంగ్రెస్ హై కమాండ్ ఢిల్లీ వేదికగా నిర్వహించిన అత్యున్నత సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై కీలక నిర్ణయం తీసుకుంది. పారదర్శకత కోసం ప్రతి స్థానానికి ముగ్గురు బలమైన అభ్యర్థులతో కూడిన ప్యానెల్ జాబితాను తయారుచేసి సమర్పించాలని జిల్లా ఇన్చార్జి మంత్రులను ఆదేశించింది.
-
రెండు స్థానాలు ఖాళీ..
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తీన్మార్ మల్లన్న.. మహబూబ్ నగర్- రంగారెడ్డి= హైదరాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి భారత రాష్ట్ర సమితి తరుపున ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సురభి వాణిదేవిలు పదవీకాలం 2027 మార్చి 29 తో ముగియనుంది.
దీంతో వీరి స్థానంలో కొత్త వారి ఎంపిక అనివార్యంగా మారింది. ఆరు నెలల ముందుగానే ఈ ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు చేయనుంది ఎన్నికల సంఘం. అందుకే ఇప్పుడు అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఎలాగైనా ఆ రెండు సీట్లను కైవసం చేసుకోవాలని చూస్తున్నాయి.
-
ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న..
గతంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉండేవారు. అయితే ఆయన ఎమ్మెల్యేగా గెలవడంతో.. వరంగల్- ఖమ్మం- నల్గొండ స్థానం ఖాళీ అయింది. 2024 జూన్ లో దానికి బైపోల్ జరిగింది. ఆ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గెలిచారు. అయితే ఆ ఎమ్మెల్సీ పదవీకాలం ఇప్పుడు పూర్తయింది. మరోవైపు 2021లో గెలిచారు వాణిదేవి. ఆరేళ్ల గడువు ముగుస్తుండడంతో ఇప్పుడు ఎన్నిక అనేది జరిపించేందుకు ఎన్నికల సంఘం పావులు కదుపుతోంది.
-
ముందస్తుగా ఓటర్ల నమోదు..
సాధారణంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అనేసరికి ఓటర్ల నమోదు ప్రక్రియ కీలకం.. ఎందుకంటే సాధారణ ఎన్నికల కంటే భిన్నంగా, చాలా సంక్లిష్టంగా, దీర్ఘకాలికంగా సాగుతుంది. సాధారణ అసెంబ్లీ లేదా లోక్సభ వాటర్ల జాబితా లాగా అది పాత జాబితా కొనసాగింపుగా కాకుండా.. ప్రతి ఎన్నికకు కొత్త నిబంధనల ప్రకారం కొత్త ఓటర్లను నమోదు చేయాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ లేదా పోలింగ్కు దాదాపు నాలుగు నుంచి ఐదు నెలల ముందే ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ లెక్కన త్వరలో ఓటర్ల జాబితా రూపకల్పన ప్రారంభించునున్నారు. అందుకే ముందస్తుగా అభ్యర్థులను ప్రకటిస్తే వారే ఓటర్ల నమోదు బాధ్యత తీసుకుంటారు.
-
గోల్డెన్ ఛాన్స్..
గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ పార్టీల స్థితిగతులనే మార్చేసాయి. అయితే ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న భారత రాష్ట్ర సమితి బలమైన అభ్యర్థులను బరిలోదించి ఈ రెండు స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తోంది. పైగా అందులో ఒకటి సిట్టింగ్ స్థానం. మరోవైపు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ మద్దతు గెలిచారు.
తర్వాత అదే పార్టీకి వ్యతిరేకమయ్యారు. అయితే ఈసారి భారతీయ జనతా పార్టీ సైతం బలమైన అభ్యర్థులను రంగంలో దించాలని చూస్తోంది. దీంతో తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అనేది గట్టిగానే ఉండనుంది.
