-
గడ్డం ఫ్యామిలీ వర్సెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
-
లీకు వీరుడు అంటూ మంత్రి వివేక్ పై పరోక్ష విమర్శలు
-
మంచిర్యాల నియోజకవర్గంలో ఎంపీ వంశీ జోక్యం పై ఆగ్రహం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు రచ్చకు ఎక్కాయి. లీకు వీరుడు అంటూ గడ్డం వివేక్ అంటూ తీవ్ర స్థాయిలో పరోక్షంగా విరుచుకుపడ్డారు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఇటీవల ప్రేమ్ సాగర్ రావు 450 కోట్ల రూపాయల బ్యాంకు రుణాల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే దీని వెనుక గడ్డం వివేక్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు ప్రేమ్ సాగర్ రావు. క్యాబినెట్ విస్తరణ ప్రస్తావన అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి తనను టార్గెట్ చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి ఎంపీ వంశీ గెలుపు కోసం రాత్రింబవళ్లు కష్టపడితే.. ఇప్పుడు తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారంటూ వాపోయారు.
తన నియోజకవర్గంలో ఆధిపత్యం చలాయిస్తే చూస్తూ ఊరుకునేది లేదు అని హెచ్చరించారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి రక్తాన్ని ధారబోసిన కార్యకర్తలను అవమానిస్తూ.. కనీస సమాచారం లేకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారని.. ఇలానే చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. తనపై కుట్రలు జరుగుతున్నాయని కూడా అనుమానం వ్యక్తం చేశారు.
-
ఎంపీగా కుమారుడి పోటీ..
మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు గడ్డం వివేక్. ఆయన కుమారుడు వంశి ఎంపీగా పోటీ చేశారు. ఇద్దరూ గెలిచారు. వివేక్ ప్రస్తుతం తెలంగాణ మంత్రిగా కూడా ఉన్నారు. మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ రావు గెలిచారు. అయితే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంశీ గెలుపు కోసం ప్రేమ్సాగర్ రావు ఎక్కువగా కృషి చేశారు. తన ఆరోగ్యాన్ని సైతం అప్పట్లో లెక్కచేయలేదు.
ఈ క్రమంలోనే ఆయన అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఎంపీ వంశి మంచిర్యాల నియోజకవర్గంలో తన సొంత క్యాడర్ను తయారు చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తనను లెక్కచేయకుండా ఎంపీ సమావేశాలు పెట్టడంపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు ప్రేమ్ సాగర్ రావు.
-
మంత్రి కాకుండా అడ్డుకోవాలని..
త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుపుతారని ప్రచారం నడుస్తోంది. అయితే సీనియర్ గా తనకు అవకాశం ఇస్తారని ప్రేమ్ సాగర్ రావు బలంగా నమ్ముతున్నారు. అయితే ఇటీవల బ్యాంకు రుణాలకు సంబంధించి ఆరోపణలు వచ్చాయి ప్రేమ్ సాగర్ రావు పై. దీని వెనుక మంత్రి గడ్డం వివేక్ హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అదే సమయంలో ఆయన కుమారుడు, ఎంపీ వంశీ మంచిర్యాల నియోజకవర్గంలో వేలు పెట్టడాన్ని తట్టుకోలేకపోతున్నారు. అందుకే గడ్డం ఫ్యామిలీ పై యుద్ధం ప్రకటించారు ప్రేమ్ సాగర్ రావు. అవసరం అనుకుంటే హై కమాండ్ కు ఫిర్యాదు చేస్తానని కూడా ఆచరిస్తున్నారు. తనను కాదని వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో అంటూ సవాల్ చేస్తున్నారు.
ఇప్పుడు ఆదిలాబాద్ కాంగ్రెస్ లో ఇదే హాట్ టాపిక్. ఇప్పటికే గడ్డం వివేక్ పెత్తనాన్ని సహించలేని చాలామంది ఇప్పుడు ప్రేమ సాగర్ రావు వెనుక నిలబడుతున్నట్లు తెలుస్తోంది. మున్ముందు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరింత తారాస్థాయికి పెరిగే అవకాశం ఉంది.
