ప్రస్తుతం థియేటర్లలో పెద్ద సినిమాల విడుదలలు తగ్గిపోవడంతో ప్రేక్షకుల దృష్టి మొత్తం ఓటీటీ వేదికలపై పడింది. ఇటీవల విడుదలైన కరుప్పు చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోగా, హీరో సూర్యకు చాలా రోజుల తర్వాత మంచి విజయాన్ని అందించింది. దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో “వీరభద్రుడు” పేరుతో విడుదలై మంచి స్పందన సొంతం చేసుకుంది. ఇక వచ్చే నెలలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది ప్రేక్షకుల ముందుకు రానుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓటీటీలో ఒక సినిమా మాత్రం సంచలనం సృష్టిస్తోంది. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ధురంధర్: ది రివెంజ్ ఇప్పుడు డిజిటల్ వేదికలపై దుమ్మురేపుతోంది. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో ఇప్పటికే బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుంది. మొదటి భాగమైన “ధురంధర్” ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వచ్చిన రెండో భాగం కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అయితే ఈ సినిమా తాజాగా పాకిస్థాన్లో ఓటీటీలో విడుదలై అక్కడ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. మే 14న డిజిటల్ విడుదలైన ఈ చిత్రం కొన్ని నిమిషాల్లోనే నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతూ భారీ వ్యూయర్షిప్ సాధించింది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. భారీ స్థాయిలో ప్రేక్షకులు ఒకేసారి సినిమా వీక్షించడంతో ఓటీటీ వేదికపై ట్రాఫిక్ పెరిగి సర్వర్లు సైతం స్లో అయినట్లు సమాచారం. ముఖ్యంగా నెట్ఫ్లెక్స్లో ఈ చిత్రానికి ఊహించని స్థాయిలో స్పందన లభించినట్లు తెలుస్తోంది.
ఇక భారతదేశంలో మాత్రం ఈ సినిమా ఇంకా డిజిటల్ విడుదల కాలేదు. భారతీయ ప్రేక్షకుల కోసం ధురంధర్: ది రివెంజ్ జూన్ 4న జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఓటీటీలో కూడా కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ మూవీ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ALSO READ: మీడియా ప్రశ్నపై అసహనం వ్యక్తం చేసిన మాళవికా మోహనన్.. గౌరవంగా వ్యవహరించాలంటూ రిక్వెస్ట్!