ఛత్తీస్గఢ్లో ఓ యువతి తీసుకున్న ధైర్యమైన నిర్ణయం ప్రస్తుతం అందరి ప్రశంసలు అందుకుంటోంది. పెళ్లి రోజున మద్యం తాగి వచ్చిన వరుడిని చూసి ఆమె పెళ్లిని రద్దు చేసుకోవడమే కాకుండా, అందరి ముందే అతడి చెంప పగలగొట్టి గట్టి బుద్ధి చెప్పింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
జాంజ్గిర్-చాంపా జిల్లాకు చెందిన 22 ఏళ్ల ముస్కాన్ ప్రధాన్కు జూన్ 23న సంత్ రామ్ అనే యువకుడితో వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి కోసం వరుడు తన బంధువులతో కలిసి ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నాడు. అయితే, అతడు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. కారు దిగిన తర్వాత కూడా సరిగా నిలబడలేని పరిస్థితిలో కనిపించాడు. ఈ విషయం వధువు ముస్కాన్కు తెలియడంతో ఆమె వెంటనే బయటకు వచ్చింది. వరుడి పరిస్థితిని చూసి తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె, అందరి ఎదుటే అతడిని చెంపదెబ్బ కొట్టి, ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది. ఆమె తీసుకున్న నిర్ణయానికి కుటుంబ సభ్యులు కూడా పూర్తి మద్దతు ఇచ్చారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకుని జోక్యం చేసుకున్నారు. అనంతరం వరుడి కుటుంబ సభ్యులను అక్కడి నుంచి పంపించారు.
ముస్కాన్ తీసుకున్న ధైర్యమైన నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్ జనమేజయ్ మహోబే అభినందించారు. ఆమె భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పదో తరగతి వరకు మాత్రమే చదివిన ముస్కాన్ తన విద్యను కొనసాగించేందుకు సహాయం చేస్తామని తెలిపారు. అలాగే ఆమె కుటుంబానికి అవసరమైన ప్రభుత్వ పథకాలను కూడా అందిస్తామని చెప్పారు. అంతేకాకుండా, మహిళల్లో అవగాహన కల్పించే కార్యక్రమాల్లో భాగంగా ముస్కాన్ను కౌన్సెలర్ గా నియమించి నెలకు రూ.5,000 గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఆమె ధైర్య నిర్ణయం పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.