వాట్సాప్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని జాతీయ సైబర్ భద్రత సంస్థ సెర్ట్ ఇన్ హెచ్చరించింది. ముఖ్యంగా మాల్ వేర్ ద్వారా వాట్సాప్ ఖాతాలను హ్యాక్ చేసి, మరింత మందిని మోసగించేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది.
సెర్ట్ ఇన్ వివరాల ప్రకారం.. సైబర్ నేరగాళ్లు మొదట కొందరి వాట్సాప్ ఖాతాలను వివిధ ప్రలోభాలతో హ్యాక్ చేస్తున్నారు. అనంతరం ఆ అకౌంట్స్ నుంచే వారి స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులకు అనుమానాస్పద ఫైళ్లను పంపిస్తున్నారు. ముఖ్యంగా ‘డాట్ వీబీఎస్’ ఫైళ్లను అటాచ్మెంట్ గా పంపి, వాటిని తెరవాలని ప్రోత్సహిస్తున్నారు.
ఇలాంటి ఫైళ్లను తెలిసిన వ్యక్తుల నుంచే వచ్చినా వెంటనే తెరవొద్దని సెర్ట్ ఇన్ సూచించింది. ఎందుకంటే వాటిలో హానికరమైన మాల్ వేర్ ఉండే అవకాశం ఉంది. పొరపాటున ఆ ఫైల్ను ఓపెన్ చేస్తే మొబైల్ ఫోన్ పూర్తిగా సైబర్ నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్లిపోవచ్చని హెచ్చరించింది. ఫోన్ లో సేవ్ చేసి ఉన్న పాస్ వర్డ్ లు, బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత సమాచారం వంటి డేటాను దొంగిలించి, బ్యాంకు ఖాతాల్లోని డబ్బును కూడా కాజేసే ప్రమాదం ఉందని పేర్కొంది. అంతేకాకుండా బాధితుడి ఫోన్ ను ఉపయోగించి ఇతరులకు కూడా మోసపూరిత సందేశాలు పంపే అవకాశం ఉందని తెలిపింది.
అందువల్ల వాట్సాప్లో ఎలాంటి అనుమానాస్పద అటాచ్ మెంట్లు వచ్చినా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ‘.vbs’ ఫైళ్లు లేదా తెలియని లింకులు వస్తే వాటిని అస్సలు ఓపెన్ చేయకూడదని హెచ్చరించింది. ఒకవేళ తెలిసిన వ్యక్తి నుంచి ఇలాంటి ఫైల్ వచ్చినా, ముందుగా వారికి ఫోన్ చేసి నిజంగానే పంపించారా లేదా అని నిర్ధారించుకోవాలని సూచించింది. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సైబర్ మోసానికి దారితీసే అవకాశం ఉన్నందున, ప్రతి వాట్సాప్ వినియోగదారు అప్రమత్తంగా ఉండాలని సెర్ట్ ఇన్ సూచించింది.