-
సందడి లేని ఆవిర్భావ దినం
-
పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని కష్టం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని శక్తి గులాబీ పార్టీది. గత పాతికేళ్లలో ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటూ.. నవ తెలంగాణను పాలించింది గులాబీ పార్టీ. అటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సందడి కరువైంది. గత పాతికేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పార్టీలో నిశ్శబ్దం ఆవహించింది. ఏడాది కిందట వరకు అట్టహాసంగా ప్లీనరీలు, బహిరంగ సభలతో హోరెత్తించింది గులాబీ పార్టీ అగ్రనాయకత్వం. కానీ ఈసారి మాత్రం కేవలం జెండా ఆవిష్కరణలకే పరిమితం అయింది. కేటీఆర్ జెండాను ఆవిష్కరించి వేడుకలను మమా అనిపించేసారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా పార్టీ శ్రేణుల్లో సందడి లేకుండానే ఆవిర్భావ దినోత్సవాన్ని ముగించారు.
వరుస పరిణామాలతో..
గులాబీ పార్టీ శ్రేణులను వరుస పరిణామాలు తీవ్ర షాక్ కు గురిచేస్తున్నాయి. అధికారం కోల్పోయిన నైరాస్యం ఒకవైపు.. వరుసగా ఎదురవుతున్న సంక్షోభాలు మరోవైపు పార్టీని మరింతగా కృంగదీస్తున్నాయి. క్యాడర్లో ఉత్సాహం నింపేలా అధినాయకత్వం నుంచి పెద్దగా ప్రయత్నాలు జరగడం లేదు. అందుకే ఆవిర్భావ దినోత్సవ మొక్కుబడి తంతులా ముగిసింది. ఈ ఏడాది ఆవిర్భావ దినోత్సవం వేళ రాజకీయంగా మరో ఆసక్తికర పరిణామం జరిగింది. కెసిఆర్ కుమార్తె కవిత టిఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీని ప్రకటించడం భారత రాష్ట్ర సమితిలో ప్రకంపనలు రేపింది. తండ్రి కెసిఆర్ వారసత్వాన్ని సవాల్ చేస్తూ.. పార్టీ ఆత్మను కోల్పోయిందని విమర్శిస్తూ కవిత వేసిన ఈ అడుగు.. భారత రాష్ట్ర సమితి నేతల్లో స్తబ్దతకు ప్రధాన కారణం అయ్యింది.
సొంత కుటుంబం నుంచి తిరుగుబాటు..
సొంత కుటుంబం నుంచి తిరుగుబాటు రావడం కెసిఆర్ పార్టీకి గొప్ప లోటు. ప్రత్యర్ధులు ఒకవైపు.. సొంత కుటుంబం మరోవైపు అన్నట్టు ఎదురు తిరగడంతో గులాబీ పార్టీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. అందుకే ఈసారి ఆవిర్భావ వేడుకలు కళ తప్పాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా జండా పండుగను నిర్వహించాలని పిలుపు ఇచ్చారు. కానీ పార్టీలో మునుపటి ఊపు కనిపించని. కెసిఆర్ స్వయంగా రంగంలోకి దిగి దిశా నిర్దేశం చేస్తే తప్ప పార్టీ గాడిలో పడదని క్యాడర్ గట్టిగానే నమ్ముతోంది. ముఖ్యంగా కవిత పార్టీ వెంట చాలామంది నేతలు వెళ్లిపోతారన్న ప్రచారం ఉంది. పార్టీ పేరు మార్పు వల్ల తెలంగాణ అనే సెంటిమెంట్ దూరమైందని భావిస్తోంది క్యాడర్. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో కవిత ముందుకు రావడం వల్ల అయోమయంలో పడిపోయింది గులాబీ పార్టీ.
క్యాడర్ అతిపెద్ద సవాల్..
ప్రస్తుతం గులాబీ పార్టీకి క్యాడర్ ను కాపాడుకోవడం అతిపెద్ద సవాల్. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఆ పార్టీ బలహీనపడుతోంది. ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక సవాల్ గా తీసుకొని పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపాల్సింది పోయి.. ఆ చేతనంగా ఉండి పోవడం మాత్రం ఎంతవరకు శ్రేయస్కరం కాదు. కేటీఆర్ నాయకత్వం పై సొంత పార్టీలోనే అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు కవిత పార్టీ కచ్చితంగా గండి కొట్టనుంది. పాతిక సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న తరుణంలో గులాబీ పార్టీకి మాత్రం ఇది గడ్డు కాలం. మరి మున్ముందు భారత రాష్ట్ర సమితి తన సవాళ్లను ఎలా అధిగమిస్తుందో చూడాలి.