-
విజయనగరంలో వైసీపీని ఖాళీ చేయించే పనిలో టిడిపి
-
ప్రత్యేకంగా దృష్టి పెట్టిన లోకేష్
-
మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కళా వెంకట్రావు, కిమిడి నాగార్జున లకు బాధ్యతలు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:- వైసీపీ సీనియర్ నేత బొత్సపై దృష్టి పెట్టింది కూటమి. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. ఇటీవల బొత్స వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కాపు రాజకీయంతో కాక రేపుతున్నారు. ఈ తరుణంలో బొత్సను వచ్చే ఎన్నికల నాటికి నిర్వీర్యం చేయాలన్న ఆలోచనతో ఉన్నారు లోకేష్. 2024 ఎన్నికల్లో పక్క వ్యూహంతో విజయనగరం జిల్లాలో బొత్స హవా కు బ్రేక్ వేశారు.
2029 ఎన్నికల నాటికి సైతం బొత్స దూకుడుకు కళ్లెం వేయాలని చూస్తున్నారు. అందుకే విజయనగరం జిల్లాలో వైసీపీని ఖాళీ చేయాలన్న ప్రణాళికతో పని చేస్తున్నారు. ఆ బాధ్యతను మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కిమిడి నాగార్జున లకు అప్పగించారు. చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు సహకారంతో బొత్స ఫ్యామిలీ హవాకు పూర్తిగా బ్రేకులు వేయాలని భావిస్తున్నారు.
-
అనతి కాలంలోనే రాష్ట్ర నేతగా..
విజయనగరం అంటేనే బొత్స హవా నడుస్తుంది. ఒక సాధారణ కోపరేటివ్ సొసైటీ చైర్మన్గా ప్రస్థానం ప్రారంభించిన బొత్స అనతి కాలంలోనే రాష్ట్ర నేతగా ఎదిగారు. 1999లో బొబ్బిలి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 5 ఎంపీ స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. అందులో బొత్స ఒకరు కావడం గమనార్హం. అందుకే వైయస్ రాజశేఖర్ రెడ్డి తన టీం లో బొత్సను తీసుకున్నారు. 2004 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు బొత్స. రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి అయ్యారు.
2009లో రెండోసారి అయ్యారు ఎమ్మెల్యేగా. మళ్లీ క్యాబినెట్ లోకి తీసుకున్నారు రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో బొత్స పేరు ముఖ్యమంత్రి పదవికి వినిపించింది. అయితే అనూహ్యంగా ఆయనకు ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా అవకాశం దక్కింది. అయితే 2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చాలామంది కాంగ్రెస్ నేతలు దూకారు. బొత్స మాత్రం అదే పార్టీలో కొనసాగారు. అయితే 2019 ఎన్నికల్లో బొత్స వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
-
ఆ మూడు నియోజకవర్గాలపై ఫోకస్..
విజయనగరం జిల్లాలో చీపురుపల్లి నుంచి బొత్స, గజపతినగరం నుంచి ఆయన సోదరుడు అప్పల నరసయ్య, నెల్లిమర్ల నుంచి సమీప బంధువు అప్పలనాయుడు 2019 ఎన్నికల్లో గెలిచారు. మరోవైపు మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయింది బొత్స ఫ్యామిలీ. అయినా సరే ఆ ఫ్యామిలీ హవా నడుస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో లోకేష్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అప్పల నరసయ్య పై గెలిచిన కొండపల్లి శ్రీనివాస్ రావు కు మంత్రి పదవి ఇచ్చారు.
కిమిడి నాగార్జునకు డిసిసిబి చైర్మన్ పదవిస్తూ టిడిపి జిల్లా పగ్గాలు అందించారు. అయితే ఇప్పుడు టిడిపి నేతలు సమన్వయంతో వ్యవహరిస్తూ చీపురుపల్లి, నెల్లిమర్ల, గజపతినగరంలో వైసీపీని ఖాళీ చేయించే పనిలో పడ్డారు. వందల కుటుంబాలు వైసీపీని వీడి టిడిపిలో చేరుతుండడంతో.. బొత్స కుటుంబ హవా కు పూర్తిగా బ్రేక్ పడినట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.