తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవడంతో విద్యార్థులు మళ్లీ విద్యాసంస్థలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్యా మండళ్లు ఇప్పటికే కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యా క్యాలెండర్లను విడుదల చేయడంతో తరగతుల పునఃప్రారంభ తేదీలపై స్పష్టత వచ్చింది.
ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమైన వేసవి సెలవులు మే 31తో ముగియనున్నాయి. అనంతరం జూన్ 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులందరికీ తరగతులు ఈ తేదీ నుంచే ప్రారంభం అవుతాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే అడ్మిషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్లో గత విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యలో ఎన్సీఈఆర్టీ ఆధారిత సిలబస్తో పాటు సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యా ప్రణాళికను ఇంటర్మీడియట్ విద్యా మండలి విడుదల చేసింది. ప్రకటించిన వివరాల ప్రకారం ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 232 పని దినాలు ఉండనున్నాయి. విద్యా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు.
ఇక తెలంగాణలో కూడా ఇంటర్మీడియట్ విద్యా మండలి ఇప్పటికే 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యా క్యాలెండర్ను విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తరగతులు జూన్ ప్రారంభం నుంచే కొనసాగనున్నాయి. తెలంగాణలో ఈ విద్యా సంవత్సరానికి మొత్తం 224 పని దినాలు ఉండనున్నట్లు నిర్ణయించారు. విద్యార్థుల విద్యా ప్రగతిని దృష్టిలో ఉంచుకుని బోధన కార్యక్రమాలను ముందుగానే ప్రణాళికాబద్ధంగా అమలు చేయనున్నట్లు సమాచారం.
మరోవైపు పాఠశాల విద్యార్థులకు మాత్రం వేసవి సెలవులు మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి. స్కూల్ విద్యార్థులకు జూన్ 11 వరకు సెలవులు అమల్లో ఉండగా, జూన్ 12 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. దీంతో సుదీర్ఘ విరామం తర్వాత విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టనున్నారు. కొత్త తరగతులు, కొత్త విద్యా సంవత్సరం, కొత్త లక్ష్యాలతో విద్యార్థులు సిద్ధమవుతున్నారు.
ALSO READ: పాక్ను వణికించిన భారీ పేలుడు.. 30 మంది మృతి