-
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు
-
కాలేశ్వరం పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
-
కాంగ్రెస్ ప్రభుత్వం పై హాట్ కామెంట్స్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు కాలేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా నీటి విడుదలపై గట్టిగానే ఫైట్ నడుస్తోంది. ఇప్పుడు అది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వార్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రజాభవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
దానికి కౌంటర్ గా భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలంగాణ భవన్ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో సమాధానం చెప్పారు. గంటన్నర పాటు సాగిన ఈ ప్రజెంటేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాలేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు సంబంధించి గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది. ఈ తరుణంలోనే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వార్ తాజాగా జరిగింది.
-
రేవంత్ పై విసుర్లు..
తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత హరీష్ రావు మాట్లాడారు. రేవంత్ రెడ్డిది పూర్తిగా నెగిటివ్ మైండ్ సెట్ అని.. రాజకీయ భేషజాలం కోసం ప్రాజెక్టులో నీళ్లు ఉన్నా.. ఎత్తిపోయకుండా రైతులను నిలువునా ముంచుతున్నారని.. ఇది ముమ్మాటికీ క్రిమినల్ నెగ్లిజెన్సీ అంటూ ఆరోపించారు. ముఖ్యమంత్రి రావత్ రెడ్డికి బహిరంగ సవాల్ చేశారు.
గతంలో కాంగ్రెస్ హయాంలో ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి ఉంటే.. దానికి సంబంధించిన అధికారిక ఒప్పంద పత్రాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఆ అగ్రిమెంటును మీరు మీడియా ముందుకు వచ్చి చూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు హరీష్ రావు. ఒకవేళ తేలేక పోతే అబద్ధాలు ఆడానని క్షమాపణలు కోరుకోవాలని సూచించారు. మహారాష్ట్ర అభ్యంతరాలు, అటవీ అనుమతుల కాలయాపన వల్ల కెసిఆర్ ముందు చూపుతో డిజైన్ మార్చాల్సి వచ్చిందని గుర్తు చేశారు.
-
చంద్రబాబు కోసమే..
కాంగ్రెస్ ప్రభుత్వం పై హాట్ కామెంట్స్ చేశారు హరీష్ రావు. పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడుకి గురుదక్షిణ ఇచ్చుకోవడం కోసమే రేవంత్ రెడ్డి గోదావరి నీటిని సముద్రం పాలు చేస్తున్నారని.. కిందకు వదిలేస్తున్నారని సంచలన ఆరోపణ చేశారు. మహిళల మంగళ సూత్రాలు తాకట్టుపెట్టి రైతులు పంటలు పండిస్తుంటే.. నీళ్లు అందుబాటులో ఉన్నా.. మోటార్లు నడపకుండా పంటలను ఎండబెడుతున్నారని విమర్శించారు.
ఈ క్రిమినల్ నెగ్లిజెన్స్ కు మిమ్మల్ని ఉరితీసిన తప్పులేదు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మేడిగడ్డ వద్ద కేవలం రెండు పిల్లర్లు కుంగితే.. దానిని సాకుగా చూపిస్తూ మొత్తం లక్ష కోట్ల ప్రాజెక్టును పనికిరాకుండా చేస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. అసలు దేవాదుల నీటిని కూడా ఎందుకు ఎత్తిపోయడం లేదని నిలదీశారు. సీఎంగా రేవంత్, నీటి పారుదల శాఖ మంత్రిగా ఉత్తంకుమార్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
-
సభలో తేల్చుకుందాం..
ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలను పదును పెట్టారు. కాలేశ్వరం అంటే ఒక బ్యారేజీ మాత్రమే కాదు అని.. అది 16 రిజర్వాయర్లు, అనేక పంపు హౌస్ ల కల్పతరువు అని చెప్పుకొచ్చారు. దీనిపై అసెంబ్లీలో కూడా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేస్తున్న ఈ కుట్రలను దుష్ప్రచారాలను అసెంబ్లీ సాక్షిగా, ప్రజల సాక్షిగా పటాపంచలు చేస్తామని ప్రకటించారు.
ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కాలేశ్వరం నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత అధికార విపక్షాల దూకుడు చూస్తుంటే మాత్రం.. రాబోయే అసెంబ్లీ సమావేశాలు హై టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయని చెప్పక తప్పడం లేదు.