-
ఎంఐఎం ను దూరం పెడుతున్న కాంగ్రెస్
-
ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ సైతం లభించని వైనం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి ఏపీలోనైనా, తెలంగాణలోనైనా ఎంఐఎం పార్టీ ఒక వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంతో సన్నిహితంగా మెలగడం ఆ పార్టీకున్న అలవాటు. పాత బస్తీలో తన పట్టు కాపాడుకోవడం నమ్ముకున్నారు. గతంలో కెసిఆర్ తో ఇదే స్నేహాన్ని కొనసాగించారు. ఇప్పుడు రేవంత్ తో కూడా అలానే ఉంటున్నారు.
కానీ రేవంత మాత్రం భిన్నంగా ఉంటున్నారు. వీలైనంతవరకు ఓవైసీతో సన్నిహిత్యం తగ్గించుకుంటున్నారు. జనవరి నుంచి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడుగుతున్నా రేవంత్ రెడ్డి నుంచి సానుకూల స్పందన రావడంలేదని అసదుద్దీన్ ఓవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. అంటే వారి మధ్య గ్యాప్ ఏ స్థాయిలో ఏర్పడిందో అర్థం అవుతుంది. అయితే ఓవైసీ కంటే రేవంత్ నుంచి కనీసం కదలిక లేదని తెలుస్తోంది.
-
తనకంటూ ముద్ర..
వాస్తవానికి తెలంగాణ రాజకీయాల్లో ఓవైసీ తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. గతంలో భారత రాష్ట్ర సమితి అధినేత కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రగతి భవన్ కు వెళ్లి కలుసుకునేవారు ఓవైసీ. కానీ రేవంత్ రెడ్డి ఆ స్థాయి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీని వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనం ఉన్నట్టు అర్థం అవుతుంది.
కాంగ్రెస్ కంచుకోటలో ఉన్న ముస్లిం ఓటు బ్యాంకును ఎంఐఎం సొంతం చేసుకుంటుంది. ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తూ కాంగ్రెస్ అవకాశాలను కొల్లగొడుతోంది. అయితే ఇక్కడ తెలంగాణలో ఎంఐఎం తో జతకడితే.. ఇప్పటివరకు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్న మైనారిటీ ఓటు బ్యాంక్.. ఎంఐఎం వైపు స్థిరపడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఓవైసీని రేవంత్ రెడ్డి దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఎంఐఎం విషయంలో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న ఈ సరికొత్త డిస్టెన్స్ పాలసీ కాంగ్రెస్ భవిష్యత్తు బాగు కోసమేనని స్పష్టమవుతోంది. కెసిఆర్ మాదిరిగా నెత్తిన పెట్టుకోకుండా.. రేవంత్ సమ దూరం పాటిస్తున్నారని అర్థం అవుతోంది.
-
సర్ ఆందోళన..
పాత బస్తీలో ఓటర్ల ముమ్మర సవరణ వల్ల వేలాది ఓట్లు గల్లంతవుతున్నాయని ఓవైసీ ఆందోళనతో ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఓట్లు తగ్గిపోతే అది ఎంఐఎం అధిపత్యానికి గండి పడక తప్పదు. అక్కడ ఉనికి లేని కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదు. రేవంత్ సర్కార్ అంతర్గత అంచనా కూడా ఇదే.
ఈ వ్యూహం ద్వారా ఎంఐఎం బలహీనపడితే… ఆ ఖాళీ ద్వారా భర్తీని కాంగ్రెస్ పార్టీతో చేయవచ్చు అనేది రేవంత్ అంచనా. అంతేకాకుండా ఎంఐఎం అజెండాకు లొంగిపోకుండా.. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా.. హిందూ వాటర్లలో కూడా కాంగ్రెస్ పట్ల సానుకూలత పెరుగుతుందని రేవంత్ భావిస్తున్నారు.
ఈ కారణంగానే ముస్లిం మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్ నిధులు ఇస్తున్నారు. అయితే రాజకీయంగా మాత్రం ఓవైసీ బ్రదర్స్ కు ముఖ్యమంత్రి కార్యాలయంలో గతం మాదిరిగా గౌరవ మర్యాదలు దక్కడం లేదు. దీని వెనుక రేవంత్ వ్యూహం ఉంది..