కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025, ఆదాయపు పన్ను నియమాలు 2026 అమలులోకి రావడంతో పాన్ కార్డు వినియోగానికి సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మార్పుల ద్వారా చిన్న స్థాయి లావాదేవీల్లో పాన్ చూపించే అవసరాన్ని కొంత సడలించడంతో పాటు, అధిక విలువ గల లావాదేవీలపై మరింత పర్యవేక్షణను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పన్ను వ్యవస్థను సరళీకరించడం, లావాదేవీల పారదర్శకతను పెంచడం, డిజిటల్ పర్యవేక్షణను బలోపేతం చేయడంపై కొత్త నిబంధనలు దృష్టి పెట్టాయి.
కొత్త నిబంధనల ప్రకారం ఇప్పటి వరకు కొన్ని నగదు లావాదేవీలకు ఉన్న పాన్ తప్పనిసరి నిబంధనల్లో మార్పులు చేశారు. గతంలో ఒకే రోజులో రూ.50,000కు మించిన నగదు డిపాజిట్లకు పాన్ అవసరం ఉండేది. ఇప్పుడు కొన్ని విభాగాల్లో పరిమితులను సవరించడం ద్వారా చిన్న, మధ్యస్థ లావాదేవీలకు ఉపశమనం కల్పించినట్లు సమాచారం. అదే సమయంలో అధిక విలువ గల లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ పర్యవేక్షణను పెంచింది.
మరో కీలక మార్పు ఫారం 60 స్థానంలో కొత్తగా ఫారం 97ను ప్రవేశపెట్టడమే. ఇప్పటి వరకు పాన్ లేని వ్యక్తులు కొన్ని నిర్దిష్ట లావాదేవీల కోసం ఫారం 60 సమర్పించే అవకాశం ఉండేది. ఇకపై ఆదాయపు పన్ను నియమాలు 2026 ప్రకారం ఫారం 97 ద్వారా ప్రకటన సమర్పించే విధానం అమల్లోకి వచ్చింది. అయితే ప్రతి లావాదేవీకి ఫారం 97 సరిపోదని, కొన్ని అధిక విలువ గల లావాదేవీలకు నేరుగా పాన్ తప్పనిసరి అవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అధిక విలువ గల ఆస్తి లావాదేవీలు, బహుమతి రూపంలో ఆస్తి బదిలీలు, సంయుక్త అభివృద్ధి ఒప్పందాలు, బీమా సంబంధిత కొన్ని ఖాతాలు, భారీ ఆర్థిక కార్యకలాపాలపై కొత్త నిబంధనలు కఠినంగా అమలు కానున్నాయి. అలాగే కొన్ని సందర్భాల్లో పాన్ లేకుండా లావాదేవీలు పూర్తి చేసే అవకాశాన్ని కూడా పరిమితం చేసినట్లు తెలుస్తోంది. ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యం పన్ను ఎగవేతను తగ్గించడం, ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడం, పారదర్శకతను పెంచడమేనని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఏ లావాదేవీకి ఏ నిబంధన వర్తిస్తుందో తెలుసుకుని ముందుగానే పత్రాలు సిద్ధం చేసుకోవడం మంచిదని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. కొత్త చట్టం అమలుతో పాన్ ప్రాధాన్యం తగ్గడం కాదు, అధిక విలువ గల లావాదేవీలలో దాని వినియోగం మరింత కట్టుదిట్టం అవుతోందని చెబుతున్నారు.