మహారాష్ట్ర రాష్ట్రంలోని గడ్చిరోలి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. జప్తలై గ్రామంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల హాస్టల్లో నిద్రిస్తున్న విద్యార్థినులపై పాము దాడి చేసింది. ఈ ఘటనలో ఆరుగురు బాలికలు పాము కాటుకు గురయ్యారు.
తక్షణమే అప్రమత్తమైన సిబ్బంది బాలికలను సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ముగ్గురు విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల వయసులు 8, 12, 14 సంవత్సరాలు కావడం మరింత విషాదాన్ని మిగిల్చింది. మరో బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసరంగా హెలికాప్టర్ ద్వారా నాగపూర్కు తరలించారు. మిగతా ఇద్దరు బాలికలు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, పాము ప్రవేశాన్ని అడ్డుకునే చర్యలు తీసుకోకపోవడంపై వారు పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఇక ఈ ఘటనపై స్థానిక అధికారులు విచారణ ప్రారంభించారు. హాస్టల్లో భద్రతా లోపాలు ఉన్నాయా అనే దానిపై సమగ్రంగా పరిశీలిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
also read: యువ నటిపై దాడి ఆరోపణలు.. నిర్మాత అరెస్ట్
