క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :-చెవిలో సమస్య ఉందని ఆసుపత్రికి వెళ్లిన 14 ఏళ్ల బాలిక వైద్య సేవలు వికటించడంతో మృతి చెందింది. ఈ ఘటన విశాఖ నగర పరిధిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. కింగ్ జార్జ్ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చెవి నొప్పితో ఒక చిన్నారి చేరింది. ఈ చిన్నారికి శస్త్ర చికిత్స నిర్వహించేందుకు ఆసుపత్రి వైద్యులు ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో చేరేందుకు ఆరోగ్యంగా నడుచుకుంటూ వెళ్లిన చిన్నారి శస్త్ర చికిత్స చేయడానికి ముందే విగతజీవిగా మారింది. ఆసుపత్రి వైద్యులు అనస్తీసియా ఇవ్వగా బాలిక అపస్మారక స్థితికి చేరుకుని మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ప్రస్తుతం విశాఖలో సంచలనంగా మారింది. బాలిక మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబీ సభ్యులు ఆసుపత్రికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా చిన్నారి చనిపోయిందంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వైద్య సేవలు అందించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆసుపత్రి బయట ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నగర పరిధిలోని వివిధ స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. బాలిక కుటుంబ సభ్యులకు వారు అండగా నిలిచారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఈ సందర్భంగా వారంతా డిమాండ్ చేశారు.
తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు..
బాలిక మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకొని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బాలిక మేనమామ మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యంగా నడుచుకుంటూ ఆసుపత్రిలోకి వెళ్లిన చిన్నారి మృతి చెందడం బాధాకరమని వాపోయారు. అనస్తీషియా ఇచ్చిన తరువాత ఏం జరిగిందో తెలియడం లేదని ఐసీయూలోకి షిఫ్ట్ చేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత బాలిక చనిపోయిందని చెప్పారని, ఎలా జరిగిందో తెలియడం లేదని వాపోయారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే బాలిక చనిపోయిందంటూ ఇతర కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. చెవి నొప్పితో వచ్చిన చిన్నారికి శస్త్ర చికిత్స చేయడానికి అవసరమైన పరీక్షలను నిర్వహించాలని, మరి బాలిక చనిపోవడానికి కారణం ఏమిటో చెప్పాలంటే డిమాండ్ చేశారు. అన్ని రకాల పరీక్షలు చేయించిన తర్వాతే సర్జరీకి రెడీ చేశారని, ఇప్పుడు ఇలా జరగడం అత్యంత బాధాకరమని కుటుంబ సభ్యులు వాపోయారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.