ఒడిశాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. గజపతి జిల్లా మోహన బ్లాక్లోని అడవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డురింగుడ-ముత్తగుడ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి టీవీఎస్ స్కూటీపై అనుమానాస్పదంగా వెళ్తుండటాన్ని గమనించారు. అతడిని ఆపి తనిఖీ చేయగా.. స్కూటీపై రెండు బస్తాల్లో గంజాయి ఉన్నట్లు గుర్తించారు.
అనంతరం మోహన తహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ రాజేంద్ర కుమార్ భుయ్యాన్ సమక్షంలో గంజాయిని తూకం వేయగా మొత్తం 40 కిలోలు ఉన్నట్లు నిర్ధారించారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ మార్కెట్లో రూ.4 లక్షలకు పైగా ఉంటుందని అంచనా.
పట్టుబడిన వ్యక్తిని అడవ పంచాయతీ పరిధిలోని ముత్తగుడ గ్రామానికి చెందిన “నర్సింగ్ మాలి అలియాస్ లారెన్స్ (48)”గా పోలీసులు గుర్తించారు. అతడిపై అడవ పోలీస్ స్టేషన్లో కేసు నంబర్ 193/2026 నమోదు చేసి, ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్ట్ చేశారు.
నిందితుడి నుంచి 40 కిలోల గంజాయి, టీవీఎస్ స్కూటీ, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు అడవ పోలీస్ అధికారి సంతోష్ బిశోయి తెలిపారు. అనంతరం నర్సింగ్ మాలిని గురువారం మోహన కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు.
also read: ప్లాస్టిక్ ఏరుకునే మహిళపై హోంగార్డు దాష్టీకం.. ఉద్యోగం నుంచి తొలగింపు, అరెస్ట్!
