-
ప్రధాని మోదీ జన్మదిన వేడుకలకు హాజరు
-
ఎన్డీఏ అగ్రనేతలతో కలిసి కార్యక్రమాలు..
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం చంద్రబాబు వారణాసి పర్యటనకు వెళ్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా జరిగే వేడుకలకు హాజరవుతున్నారు. గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా పాతికేళ్ల పాలనా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా వారణాసిలో వేడుకలు నిర్వహిస్తున్నారు.
సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న కాశీ కేంద్రంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, బిజెపి జాతీయ నాయకత్వం కలిసి సేవా సంకల్ప అభియాన్, భారీ బైక్ ర్యాలీని ప్రారంభించనున్నాయి. అందులో భాగంగా రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ప్రత్యేక సదస్సులో చంద్రబాబు పాల్గొనున్నారు.
-
ప్రత్యేక ఏర్పాట్లు..
ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను ప్రత్యేకంగా చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించారు. వారణాసి పర్యటనలో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి చిరాగ్ పాస్వన్ తదితర ఎన్డీఏ అగ్రనేతలతో కలిసి చంద్రబాబు వేదిక పంచుకొనున్నారు.
కాశీలోని లలితా ఘాట్ వద్ద 51 మంది సేవా కార్యకర్తల గంగాజలం సేకరించి, కాశీ విశ్వనాధునికి జలాభిషేకం చేసి, 11 కుండాల మహా యజ్ఞంలో పాల్గొనున్నారు చంద్రబాబు. అటు తర్వాత కాశీ నుంచి మోడీ జన్మస్థలమైన గుజరాత్ లోని వద్ నగర్ వరకు సాగే భారీ సేవ సంకల్ప బైక్ యాత్రను ప్రారంభించనున్నారు.
-
బలమైన బంధం..
ఎన్డీఏ లో కీలక భాగస్వామిగా ఉన్నారు చంద్రబాబు. ప్రధాని నరేంద్ర మోడీతో ఉన్న బలమైన మైత్రి బంధాన్ని ఈ వేదిక ద్వారా మరోసారి చాటుకోనున్నారు. మోడీ పబ్లిక్ సర్వీస్, వెజినరీ నాయకత్వాన్ని అభినందిస్తూ.. మోడీ నాయకత్వంలో ఏపీ వికాసానికి, అమరావతి అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న మద్దతు ఈ సందర్భంగా స్మరించుకునే అవకాశం ఉంది.
కాశీ పర్యటన నిమిత్తం చంద్రబాబు ప్రత్యేక విమానంలో ఈరోజు బయలుదేరనున్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు కొనసాగనున్నాయి. సేవ పక్వాడా పేరుతో రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య పరీక్షలు, పరిసరాల పరిశుభ్రత డ్రైవ్ ల రూపంలో దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు.
