ప్రియుడితో కలిసి కన్నతల్లిని కుమార్తె హత్య చేసిందనే ఆరోపణలు గుంటూరు జిల్లా పొన్నూరులో కలకలం రేపుతున్నాయి. పట్టణానికి చెందిన ఈవూరు లక్ష్మి (45) తెల్లవారుజామున అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఆమె కుమార్తె పుష్పలతతో పాటు విజయవాడకు చెందిన రాజాపై అనుమానంతో విచారణ కొనసాగిస్తున్నారు.
పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం.. పుష్పలతకు గతంలో వివాహం జరిగింది. అయితే భర్త మరణించిన అనంతరం విజయవాడకు చెందిన రాజాతో ఆమెకు సన్నిహిత సంబంధం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి లక్ష్మిని హత్య చేసి, ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదును తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఘటనకు సంబంధించి పుష్పలత కుమారుడు ఇచ్చిన సమాచారం కీలకంగా మారినట్లు తెలుస్తోంది. తన తల్లి, రాజా కలిసి అమ్మమ్మను హత్య చేసినట్లు బాలుడు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ముందుగా రాజా లక్ష్మి కాళ్లను కట్టివేయగా.. అనంతరం పుష్పలత మూడు చీరలను ఉపయోగించి ఆమె మెడకు చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు బాలుడు వివరించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం నెలకొంది. ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలు కూడా కనిపించకపోవడంతో ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
లక్ష్మి మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. అనుమానితుల ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు చేపట్టినట్లు సమాచారం. హత్యకు అసలు కారణం ఏమిటి? ఆస్తి, నగదు కోసమే ఈ ఘటన జరిగిందా? లేక వ్యక్తిగత సంబంధాలే కారణమా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసుల పూర్తి దర్యాప్తు అనంతరం ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read : కోర్టు ఆదేశాలు బేఖాతర్.. పంచాయతీ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు
