క్రైమ్ మిర్రర్ : రోడ్డు ప్రమాదంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న అధికారి మృతి చెందిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నల్లగండ్ల ఫ్లైఓవర్ సమీపంలో స్కూటీ అదుపుతప్పి కిందపడటంతో తీవ్రంగా గాయపడిన దినకర్ (35) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్చెరు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న పోస్నెట్ దినకర్.. పటాన్చెరు జేపీ కాలనీలో నివాసం ఉంటున్నారు. వ్యక్తిగత పనిమీద తన స్కూటీపై నల్లగండ్లకు వెళ్లారు. పని ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో నల్లగండ్ల ఫ్లైఓవర్ సమీపంలో స్కూటీ అదుపుతప్పడంతో దినకర్ రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి విషమించడంతో దినకర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
మృతుడి సోదరుడు శుభాకర్ చార్లెస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు చందానగర్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రావు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
also read : నగరంలో గంజాయి ముఠా అరెస్ట్.. 21 కిలోల సరుకు స్వాధీనం
