క్రైమ్ మిర్రర్ : కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో పంచాయతీ కార్యదర్శి ప్రియాంకపై సస్పెన్షన్ వేటు పడింది. గృహ నిర్మాణానికి సంబంధించిన వ్యవహారంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోలేదని ఆమెపై ఫిర్యాదు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కలకల్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ప్రియాంక పనిచేసిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా వ్యవహరించారంటూ సంబంధిత వ్యక్తులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదును పరిశీలించిన కలెక్టర్.. ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. విచారణలో ప్రియాంక విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలడంతో ఆమెపై చర్యలు తీసుకున్నట్లు మనోహరాబాద్ ఎంపీడీవో కృష్ణమూర్తి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రియాంకను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆమె ముప్పిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
అయితే పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్కు గురైన విషయాన్ని ఎంపీడీవో వెంటనే వెల్లడించకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు కోర్టు ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోందని స్థానికులు పేర్కొన్నారు.
also read : తిరుపతిలో ఉద్రిక్తత.. విద్యార్థినిని జుట్టు పట్టుకుని లాక్కెళ్లిన ఎస్ఐ
