-
ఏఎన్నార్ కంపెనీలో విస్తృత తనిఖీలు
-
ప్రముఖ పారిశ్రామికవేత్త మహేష్ రెడ్డి టార్గెట్ గా ఏకకాలంలో సోదాలు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: హైదరాబాదులో ఈడి సోదాలు విస్తృతం చేసింది. అయితే అనూహ్యంగా ఈసారి రాజకీయ నాయకులపై కాదు. ఓ బడా కాంట్రాక్టర్ను టార్గెట్ చేసుకుంటూ ఈడి తనిఖీలు చేయడం విశేషం. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, బడా కాంట్రాక్టర్ మహేష్ రెడ్డి టార్గెట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు విస్తృత సోదాలు ప్రారంభించారు.
బంజారాహిల్స్ కమలాపురి కాలనీలో ఉన్న ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ ప్రధాన కార్యాలయం తో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోని ఆయన నివాసాలు, అనుబంధ కంపెనీల ప్రాంగణాల్లో ఈడి బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. కీలక పత్రాలతో పాటు ఆర్థిక లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకుంది.
-
ఏకకాలంలో..
హైదరాబాదులో ఈడి బృందాలు ఒకేసారి తనిఖీలు చేయడం సంచలనంగా మారింది. దీంతో ఏఎంఆర్ కన్స్ట్రక్షన్ చుట్టూ చర్చ మొదలైంది. ఎవరి మహేష్ రెడ్డి అంటూ అందరూ ఆర్ఆర్బియడం కనిపించింది. నెల్లూరు జిల్లా పాపిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన మహేష్ రెడ్డి.. హైదరాబాద్ కేంద్రంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకొని పారిశ్రామికవేత్తగా ఎదిగారు.
1992లో తన సోదరుడు గిరీష్ రెడ్డితో కలిసి ఏఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ పేరుతో చిన్న భాగస్వామ్య సంస్థను ప్రారంభించారు. వేలకోట్ల టర్న్ అవర్ తో ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ గ్రూపుగా విస్తరించారు. వ్యాపారంతో పాటు తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా కూడా వ్యవహరించారు. గతంలో షిరిడి సాయిబాబా సంస్థాన్ కు ఏకంగా 145 కిలోల బంగారు సింహాసనం, బంగారం తొడుగులు విరాళంగా ఇచ్చి దేశవ్యాప్తంగా బంగారు రెడ్డిగా గుర్తింపు పొందారు.
-
రెండు రాష్ట్రాల నేతలతో..
మహేష్ రెడ్డి గతంలో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ట్రస్టీగా కూడా సేవలందించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రాజకీయ నాయకులతో ఆయనకు విస్తృత సంబంధాలు ఉన్నాయి. ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ అనేది మైనింగ్, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, హైవేలు, పారిశ్రామిక నిర్మాణాల్లో దేశంలోనే అగ్రగామి కాంట్రాక్టు సంస్థల్లో ఒకటి.
ముఖ్యంగా ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో దేశవ్యాప్తంగా బొగ్గు, సున్నపురాయి, లిగ్నైట్, బాక్సైట్ తవ్వకాల్లో ఈ సంస్థ భారీ ప్రాజెక్టులను చేపట్టింది. సింగరేణి, కోల్ ఇండియా అనుబంధ సంస్థలతోపాటు ఇండియా సిమెంట్, గ్రాసిమ్ సిమెంట్స్ వంటి దిగ్గజ ప్రైవేట్ సంస్థలకు మైనింగ్ కాంట్రాక్టర్ గా పనిచేస్తుంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జలయజ్ఞం కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు సాగునీటి కాలువలు, బ్యారేజీల పనులను దక్కించుకుంది..
-
మనీ లాండరింగ్ ఆరోపణలు..
అయితే ఇప్పుడు ఏఎంఆర్ సంస్థలపై దాడులు వెనుక సంచలన అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. భారీ మైనింగ్ కాంట్రాక్టుల కేటాయింపులు, మనీలాండరింగ్ నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు సమాచారం. జమ్మూ కాశ్మీర్ తో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో గతంలో దక్కిన భారీ ప్రాజెక్టులకు సంబంధించి.. నిధులు మళ్లింపు జరిగిందన్నది ప్రధాన అభియోగం.
నాటి అధికారంలో ఉన్న కీలక నేతలు, ఉన్నతాధికారులకు ముడుపులు చెల్లించారనే కోణంతోపాటు దాదాపు 60 కోట్ల రూపాయలకు పైగా విలువైన అనుమానాస్పద లావాదేవీలు.. షెల్ కంపెనీల ద్వారా వచ్చిన నిధుల ప్రవాహం పై ఈడి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
