పల్నాడు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కలుషితమైన పశువుల దాణా తినడంతో 18 గోవులు మృతి చెందిన ఘటన ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో కలకలం రేపింది. మంగళవారం ఉదయం గోశాలలో పెద్ద సంఖ్యలో పశువులు మృతిచెందిన విషయం వెలుగులోకి వచ్చింది.
స్థానికంగా లభించిన వివరాల ప్రకారం.. ఓ రైతు గోశాలకు సమీపంలో యూరియా బస్తాలను నిల్వ ఉంచినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి భారీ వర్షం కురవడంతో బస్తాలు తడిసిపోయాయి. దీంతో యూరియా కరిగి వర్షపు నీటితో కలిసి పక్కనే ఉన్న పశువుల దాణాలోకి చేరినట్లు సమాచారం.
ఈ విషయం గుర్తించకుండానే మంగళవారం ఉదయం గోశాల నిర్వాహకులు పశువులకు ఆ దాణాను అందించారు. దాణా తిన్న కొద్దిసేపటికే గోవుల్లో తీవ్ర అస్వస్థత కనిపించింది. ఒక్కొక్కటిగా పశువులు కుప్పకూలిపోవడంతో నిర్వాహకులు ఆందోళనకు గురయ్యారు. అయితే అప్పటికే 18 గోవులు మృతి చెందినట్లు సమాచారం.
ఉదయం గోశాలకు చేరుకున్న నిర్వాహకులకు మృతిచెందిన పశువులు కనిపించడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో గోవులు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కలుషిత దాణా కారణంగానే ఈ ఘటన జరిగిందా? లేదా మరేదైనా కారణం ఉందా? అనే అంశంపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేయాల్సి ఉంది. పశువుల మృతికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: రీల్స్ చూస్తుండగా నెట్ సిగ్నల్ కట్.. తీవ్ర ఆవేదనతో మహిళ ఆత్మహత్య
