పెళ్లి సందడి ముగియకముందే ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. వివాహమైన వారం రోజులు కూడా పూర్తికాకముందే నవ వరుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా పరిధిలో విషాదాన్ని నింపింది.
సంతకవిటి మండలం కె.రామచంద్రాపురం గ్రామానికి చెందిన కోసూరు నారాయణరావు (21)కు గత నెల 30న వివాహం జరిగింది. ఈ నెల 5న శ్రీకాకుళం జిల్లా రాపాకలో జరిగిన బంధువుల వివాహానికి నారాయణరావు తన మేనల్లుడు జగదీష్తో కలిసి బైక్పై వెళ్లారు. కార్యక్రమం అనంతరం తిరిగి వస్తుండగా పొందూరు మండలం నర్సాపురం వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో నారాయణరావు తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఆయనతో పాటు ప్రయాణిస్తున్న జగదీష్ తీవ్రంగా గాయపడటంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఇటీవలే పెళ్లి చేసుకున్న నారాయణరావు ఇలా అకస్మాత్తుగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ముఖ్యంగా పెళ్లై వారం రోజులు కూడా గడవకముందే భర్తను కోల్పోవడంతో నవ వధువు కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఆమెను ఓదార్చడం బంధువులు, కుటుంబ సభ్యుల వల్ల కూడా కావడం లేదు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
also read: కర్నూలులో దారుణం.. పారిశుద్ధ్య కార్మికురాలిపై పెట్రోల్ దాడి
