-శాసనమండలిలో ఆరు స్థానాలు ఖాళీ
-పట్టభద్రులు రెండు, గవర్నర్ కోటా కింద నాలుగు
-అధికార పార్టీలో ఆశావహులు అధికం
-ప్రయత్నాలు ముమ్మరం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:-
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. త్వరలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. గవర్నర్ కోటాలో 4, పట్టభద్రుల కోటాలో రెండు స్థానాలు ఖాళీ అవనున్నాయి. వాటి స్థానంలో ఉప ఎన్నిక అనివార్యం. దీంతో మరోసారి సందడి నెలకొంది తెలంగాణలో. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.
పోటా పోటీ తప్పేలా లేదు…
గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ ముద్ర ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సిఫారసు చేసే వారికి పదవులు దక్కుతాయి. కానీ వరంగల్ -నల్గొండ- ఖమ్మం పట్టభద్రుల స్థానంతో పాటు హైదరాబాద్ – రంగారెడ్డి పట్టభద్రుల స్థానం మాత్రం హాట్ టాపిక్ గా మిగలనున్నాయి. అధికార కాంగ్రెస్తోపాటు విపక్ష భారత రాష్ట్ర సమితి తమ అభ్యర్థులను బరిలో దించనుంది. వీరితోపాటు ప్రజాసంఘాల నుంచి సైతం పెద్ద ఎత్తున అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉంది. కచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక పరీక్ష లాంటిది. ఆ రెండు స్థానాలను కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
పట్టభద్రుల స్థానాల్లో..
తెలంగాణ శాసనమండలిలో గోరటి వెంకన్న, బొగ్గరపు దయానంద్, బసవరాజు సారయ్యల పదవీకాలం నవంబర్ 14తో ముగియనుంది. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న సిరికొండ మధుసూదనాచారి పదవీకాలం డిసెంబర్ 13 తో ముగుస్తుంది. అదే సమయంలో పట్టభద్రుల స్థానంలో సురభి వాణిదేవి, చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న పదవీకాలం కూడా ముగుస్తుంది. అయితే పట్టభద్రుల స్థానానికి సంబంధించిన ఆశావహులు ఇప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రధానంగా వరంగల్, నల్గొండ,ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి అవకాశం కోసం కాంగ్రెస్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు పీవీ శ్రీనివాస్, నల్గొండ డిసిసి అధ్యక్షుడు పున్న కైలాస్, చనగాని దయాకర్, ఇందిరా వంటి వారు పోటీపడుతున్నారు. భారత రాష్ట్ర సమితి నుంచి గతంలో ఓడిపోయిన ఏనుగుల రాకేష్ రెడ్డి మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు.
గవర్నర్ కోటాలో..
హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు పిపిసిసి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, సామ రామ్మోహన్ రెడ్డి, టీ షాట్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, శివసేనారెడ్డిలు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నింటికీ మించి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దక్కించుకునేందుకు నేతలు క్యూ కడుతున్నారు.
