వినాయక చవితి పండుగ సందర్భంగా తెలంగాణ పోలీసులు ప్రజలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. సెప్టెంబర్ 14న వినాయక చవితి నేపథ్యంలో ‘సైబర్ విజ్ఞానం కలిగి ఉండండి’ అనే సందేశంతో వినూత్న పోస్టర్ను విడుదల చేశారు.
గణేశుడి రూపాన్ని పోలిన ఈ పోస్టర్ ద్వారా ఆన్లైన్ మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. గణేశుడి పెద్ద చెవులు.. ఏ విషయాన్నైనా శ్రద్ధగా వినాలనే సందేశాన్ని, చిన్న కళ్లు నిశితంగా పరిశీలించాలనే సూచనను ఇస్తున్నాయని వివరించారు.
అలాగే చేతిలోని కలం ద్వారా సాంకేతికతను బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. సోషల్ మీడియా, ఆన్లైన్ లావాదేవీలు, అనుమానాస్పద లింకులు, మోసపూరిత కాల్స్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు.
ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్లైన్ నంబర్కు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు. అలాగే cybercrime.gov.in వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
పండుగ వేళ ఆనందంతో పాటు సైబర్ భద్రతపై కూడా అవగాహన కలిగి ఉండాలని తెలంగాణ పోలీసులు ఈ వినూత్న పోస్టర్ ద్వారా ప్రజలకు సందేశం ఇచ్చారు.
