రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా పాలకుర్తిలో ఓ జంతు ప్రేమికురాలు ప్రత్యేకంగా పండుగ జరుపుకున్నారు. పాలకుర్తికి చెందిన దేవగిరి భార్గవి తన పెంపుడు గోవులను కుటుంబ సభ్యులుగా భావిస్తూ వాటికి రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు.
వేదమంత్రాల నడుమ గోవులకు తిలకం దిద్దిన భార్గవి.. అనంతరం వాటి కాళ్లకు రాఖీలు కట్టి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. దీపహారతి ఇచ్చి గోవుల పట్ల తనకున్న ఆప్యాయతను చాటుకున్నారు.
సాధారణంగా రక్షాబంధన్ సందర్భంగా సోదరులకు మిఠాయిలు అందించడం ఆనవాయితీ. అయితే భార్గవి మాత్రం తన పెంపుడు గోవులకు మిఠాయిలకు బదులుగా అరటి పండ్లు, ఆకుకూరలను ఆహారంగా అందించారు. వాటిని ప్రేమగా తినిపిస్తూ కొంతసేపు వాటితో గడిపారు.
మూగజీవులపై ప్రేమను చూపిస్తూ రక్షాబంధన్ను వినూత్నంగా జరుపుకున్న భార్గవి తీరును స్థానికులు అభినందించారు. జంతువులను కేవలం పెంపుడు జంతువులుగా కాకుండా కుటుంబ సభ్యులుగా చూసుకోవాలనే సందేశాన్ని ఆమె ఈ సందర్భంగా చాటిచెప్పారని గ్రామస్తులు పేర్కొన్నారు.
also read: నేపాల్కు మరో ముప్పు.. 72 గంటల్లో బ్యారియర్ సరస్సు పొంగే అవకాశం
