అమరావతి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లా మహిళా ఆసుపత్రిలోని నవజాత శిశువుల నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు పసికందులు మృతి చెందగా.. మరో ఆరుగురు శిశువుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
సోమవారం ఉదయం సుమారు 3.30 గంటల సమయంలో NICUలోని వెంటిలేటర్లో పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో వార్డులో మొత్తం 39 మంది నవజాత శిశువులు ఉన్నారు.
మంటలు వ్యాపించడంతో ఆసుపత్రి సిబ్బంది వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. పలువురు శిశువులను సురక్షితంగా బయటకు తరలించారు. అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులను రక్షించలేకపోయారు.
తీవ్రంగా గాయపడిన లేదా పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న ఆరుగురు శిశువులను మెరుగైన వైద్యం కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై అధికారులు, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వెంటిలేటర్లో సాంకేతిక లోపం కారణంగానే మంటలు చెలరేగాయా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
ఈ ఘటనతో ఆసుపత్రిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ చిన్నారులను కోల్పోయిన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అగ్నిప్రమాదానికి అసలు కారణం, ఆసుపత్రి భద్రతా ఏర్పాట్లపై అధికారులు సమగ్రంగా పరిశీలిస్తున్నారు.
also read: ఏపీ మద్యం రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్
