-
బిజెపి జాతీయ కార్యవర్గ ప్రకటనతో జోరుగా ఊహాగానాలు
-
తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురికి కొత్తగా చోటు
-
ఏపీ నుంచి టీడీపీకి మరో మంత్రి పదవి
-
తెలంగాణలో ఇద్దరు సీనియర్లకు ఛాన్స్
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? అయితే ఎప్పుడు చేపడతారు? తెలుగు రాష్ట్రాల నుంచి ఛాన్స్ దక్కేది ఎవరికి? తీసివేతలు ఎవరివి? అనే బలమైన చర్చ నడుస్తోంది. బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తన నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. దీంతో కేంద్ర మంత్రివర్గ విస్తరణ పై మళ్లీ ఊహాగానాలు ప్రారంభం అయ్యాయి.
-
రెండు సంవత్సరాలు దాటడంతో..
కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చారు. బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాలు దాటుతోంది. అందుకే మంత్రి వర్గాన్ని విస్తరిస్తారన్న ప్రచారం గత కొద్ది రోజులుగా ఉంది. ఇప్పుడు బిజెపి కార్యవర్గం ప్రకటించడంతో అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణ పై పడింది.
ఈ మొదటి ప్రధాన విస్తరణలో దాదాపు 20 నుంచి 30 మంది వరకు మంత్రుల శాఖల్లో మార్పులు ఉండబోతున్నాయి అనేది ప్రధాన ప్రచారం. అలాగే కొందరికి ఉద్వాసన తప్పదు అనే టాక్ కూడా నడుస్తోంది.
త్వరలో ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గుజరాత్ వంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
-
శాఖల ప్రగతి తెలుసుకుంటూ..
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ సుదీర్ఘ సమీక్ష చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రుల పనితీరుపై ఈ సమీక్ష సాగినట్లు తెలుస్తోంది. ట్రాక్ రికార్డు సరిగ్గా లేని మంత్రులను తప్పించి కొత్తవారికి అవకాశం ఇస్తారని ఢిల్లీ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది.. అలాగే రాజ్యసభ కాలపరిమితి ముగిసిన కొందరు మంత్రుల రాజీనామాలు, కూటమి భాగస్వామ్యాల సమతుల్యత కూడా ఈ పునర్వ్యవస్థీకరణ లో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.
-
తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యం..
ప్రధానంగా ఈసారి ఉభయ తెలుగు రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోడీ మంచి అవకాశాలు కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఏపీ నుంచి భాగస్వామ్య పార్టీ టిడిపికి ఒక సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.
ఇంకోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని.. మరో ఇద్దరు ఎంపీలకు కేంద్రమంత్రి పదవులు ఇస్తారని తెలుస్తోంది. ప్రధానంగా ఈటెల రాజేందర్, డీకే అరుణ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరికీ కేంద్ర మంత్రులుగా అవకాశం ఇస్తే రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి దోహదపడుతుంది అనేది కేంద్ర పెద్దల ఆలోచనగా తెలుస్తోంది.
