బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ యువతపై చేసిన గత వ్యాఖ్యల విషయంలో తన వైఖరిని స్పష్టం చేశారు. ఇటీవల జెన్-జీ యువతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో.. తాజాగా ఆమె యువతను ప్రశంసిస్తూ మాట్లాడారు.
పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడిన కంగనా రనౌత్.. జెన్-జీ తరం దేశానికి ఎంతో కీలకమని పేర్కొన్నారు. యువత దేశానికి బలం, గొప్ప ఆస్తి అని అభివర్ణించారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లడంలో యువత పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు.
కొంతమంది కారణంగా మొత్తం తరాన్ని తప్పుపట్టడం సరికాదు
కొద్దిమంది వ్యక్తుల ప్రవర్తన ఆధారంగా మొత్తం యువతరాన్ని విమర్శించడం సరైన పద్ధతి కాదని కంగనా స్పష్టం చేశారు. శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే యువతను, అల్లర్లకు పాల్పడే వారిని ఒకేలా చూడకూడదని అన్నారు.
మోహన్ భగవత్ వ్యాఖ్యలను ప్రస్తావించిన కంగనా
ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను కంగనా గుర్తు చేశారు. నిరసనలు చేసే ప్రతి ఒక్కరినీ దేశ వ్యతిరేకులుగా చూడకూడదని, వారి సమస్యలను విని చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నించాలని ఆయన సూచించిన విషయాన్ని ప్రస్తావించారు.
గతంలో ‘గట్టర్ జనరేషన్’ వ్యాఖ్యలపై వివాదం
పరీక్షల వ్యవహారంలో నిరసనలు చేస్తున్న కొందరు యువతపై కంగనా గతంలో తన సోషల్ మీడియా పోస్టుల్లో విమర్శలు చేశారు. కొందరు యువతుల భాష, ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారిని ‘గట్టర్ జనరేషన్’ అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. యువత మొత్తాన్ని ఒకే కోణంలో చూడకూడదంటూ పలువురు అభిప్రాయపడ్డారు.
తాజాగా కంగనా చేసిన వ్యాఖ్యలతో ఆమె తన వైఖరిని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. యువతలో మంచి మార్పును గుర్తించాలని, అలాగే తప్పు చేసే వారిని మాత్రమే ప్రశ్నించాలని ఆమె చెప్పుకొచ్చారు.
also read: నెట్ఫ్లిక్స్లో దుమ్మురేన ‘ధురంధర్’.. ప్రపంచవ్యాప్తంగా నాన్-ఇంగ్లీష్ సినిమాల్లో టాప్ రికార్డు!
