హర్యానాలోని సోనిపత్లో ఒక హృదయాన్ని కదిలించే ఘటన వెలుగులోకి వచ్చింది. జీవితాంతం తన కుటుంబం కోసం కష్టపడి పనిచేసిన ఓ వృద్ధుడు చివరకు వృద్ధాశ్రమంలోనే ప్రాణాలు విడవగా, అతని కుమార్తెలు వీడియో కాల్ ద్వారా చివరి వీడ్కోలు పలకాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వివరాల ప్రకారం… ముంబైకు చెందిన శివచరణ్ రామ్ రతన్ గుప్తా అనే వ్యక్తి గతంలో వస్త్ర వ్యాపారిగా పనిచేశారు. తన ముగ్గురు కుమార్తెల చదువు, వారి భవిష్యత్తు కోసం జీవితాంతం కష్టపడ్డారు. అయితే కాలక్రమేణా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో సోనిపత్లోని వెస్ట్ రామ్ నగర్ ప్రాంతంలో ఉన్న ఒక వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందారు.
ఇప్పటికే ఆయన భార్య మీనా మరణించడంతో, వృద్ధాశ్రమమే ఆయనకు చివరి నివాసంగా మారింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గుప్తా మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు.
ఈ విషయం తెలుసుకున్న వృద్ధాశ్రమం నిర్వాహకులు వెంటనే ఆయన కుమార్తెలకు సమాచారం అందించారు. అయితే వారు నేపాల్, ఉత్తరప్రదేశ్, ముంబై వంటి ప్రాంతాల్లో ఉండటంతో వెంటనే అక్కడికి చేరుకోలేకపోయారు. దీంతో వారు వీడియో కాల్ ద్వారా తండ్రి అంత్యక్రియలను వీక్షిస్తూ కన్నీరుమున్నీరయ్యారు.
తండ్రికి చివరి వీడ్కోలు చెప్పేందుకు వారు దూరం నుంచే ఉండాల్సి రావడం అందరినీ కలచివేసింది. అంత్యక్రియల కోసం వారు ఆర్థిక సహాయం అందించగా, వృద్ధాశ్రమ సిబ్బంది, స్థానికుల సహకారంతో దహన సంస్కారాలు నిర్వహించారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా పంచబడుతుండగా, నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు దూరంగా ఉండటం, తండ్రి చివరి క్షణాల్లో ఒంటరిగా ఉండాల్సి రావడం సమాజంలో మారుతున్న పరిస్థితులను గుర్తుచేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
also read: నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాతో కూతురుని వేధిస్తున్నారని తండ్రి ఫిర్యాదు- హైదరాబాద్లో కేసు నమోదు
