హైదరాబాద్, క్రైమ్మిర్రర్: మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం తన కొత్త చిత్రం కొరియన్ కనకరాజు ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సోషల్ మీడియా ట్రోలింగ్, ఫ్యాన్ వార్స్ గురించి మాట్లాడుతూ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. తాను స్కూల్ రోజుల్లో ఉన్నప్పుడు అభిమానుల మధ్య ఇంత తీవ్ర స్థాయి పోటీ ఉండేది కాదన్నారు. వేర్వేరు హీరోలను అభిమానించే స్నేహితులతో కలిసి సినిమాలు చూసేవాళ్లమని, ఒకరి అభిరుచిని మరొకరు గౌరవించుకునే వాతావరణం ఉండేదని చెప్పారు. కానీ సోషల్ మీడియా పెరిగిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు.
Also Read:తెలంగాణలో జెన్ జీ తుస్!
గతంలో ఆర్కుట్, ఫేస్బుక్ వంటి వేదికల్లో ఎక్కువగా టెక్స్ట్ రూపంలో మాత్రమే కామెంట్లు ఉండేవని, ఇప్పుడు మాత్రం ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి ప్లాట్ఫార్మ్లలో మీమ్స్, ఫోటోలు, వీడియోల రూపంలో ట్రోలింగ్ ఎక్కువైందన్నారు. కాలంతో పాటు ట్రోలింగ్ చేసే విధానం కూడా మారిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. తన మొదటి సినిమా విడుదలైన సమయంలో ఎదురైన అనుభవం గురించి కూడా వరుణ్ తేజ్ ఎమోషనల్గా మాట్లాడారు. తనపై విమర్శలు రావడం ఒక విషయం అయితే, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన కామెంట్లు చేయడం చాలా బాధ కలిగించిందన్నారు. అలాంటి వ్యాఖ్యలు చూసి తాను తీవ్రంగా మనస్తాపానికి గురై ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని వెల్లడించారు.
Also Read:వైసీపీపై బోరుగడ్డ తిరుగుబాటు!
ప్రారంభంలో ఆ ట్రోలింగ్ను తట్టుకోవడం చాలా కష్టంగా అనిపించేదని, కానీ కాలక్రమేణా అలాంటి విషయాలను ఎలా తీసుకోవాలో నేర్చుకున్నానన్నారు. ప్రజలందరినీ సంతృప్తిపరచడం సాధ్యం కాదని, అందుకే ఇప్పుడు తన పనిపైనే దృష్టి పెడుతున్నానని చెప్పారు. ఇక వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అభిమానులు కూడా ట్రోలింగ్కు హద్దులు ఉండాలని, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు.
