• ఉక్క పోత తట్టుకోలేక, ఫ్యాన్లు తిరగక నరకయాతన
క్రైమ్ మిర్రర్, నల్గొండ నిఘా ప్రతినిధి : నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో కనీస సదుపాయాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రి యాజమాన్యం మరియు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ చికిత్స పొందుతున్న రోగులకు తిప్పలు తప్పడం లేదు.
గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలోని పలు వార్డుల్లో ఫ్యాన్లు పని చేయకపోవడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.ప్రసూతి (గర్భవతుల) వార్డులో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ప్రసవం అయి, ఆపరేషన్లు చేసుకున్న మహిళలు ఉక్కపోతను తట్టుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు. పసిపిల్లలతో ఉన్న బాలింతలు ఫ్యాన్లు తిరగక విసనకర్రలతో విసురుకుంటూ గడపాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం రెస్పాన్స్ లేకుండా వ్యవహరిస్తున్నారని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం వారి బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం.
వెంటనే ఉన్నతాధికారులు స్పందించి, బంద్ అయిన ఫ్యాన్లకు మరమ్మతులు చేయించి, ఆస్పత్రిలో కనీస వసతులు కల్పించాలని, రోగులకు తగిన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని రోగుల కుటుంబ సభ్యులు మరియు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
