హైదరాబాద్, క్రైమ్మిర్రర్: సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా కోయంబత్తూరులో నిర్వహించిన ఆడియో లాంచ్ కార్యక్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమాను తమిళ ప్రేక్షకులకు అల వైకుంఠపురములో తరహా అనుభూతిని ఇచ్చే చిత్రంగా అభివర్ణిస్తూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేదికపై మాట్లాడిన నాగవంశీ ముందుగా తమిళంలో మాట్లాడలేకపోతున్నందుకు క్షమాపణలు తెలిపారు. ఇది తనకు రెండో తమిళ సినిమా మాత్రమేనని, త్వరలోనే తమిళ భాషను నేర్చుకుంటానని చెప్పారు.
Also Read:నడిరోడ్డుపై దారుణ హత్య.. కొబ్బరికాయలు కొట్టే కత్తితో దాడి
కోయంబత్తూరుతో ఈ సినిమాకు ప్రత్యేక అనుబంధం ఉందని, షూటింగ్తో పాటు ప్రమోషన్లు కూడా అక్కడి నుంచే ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. దర్శకుడు వెంకీ అట్లూరి, తనపై సూర్య ఉంచిన నమ్మకానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కథ వినగానే ఎలాంటి సందేహం లేకుండా సూర్య ఈ ప్రాజెక్ట్కు అంగీకరించారని వెల్లడించారు. ఇప్పటికే తాను సినిమా ఫైనల్ కట్ చూశానని, ఫలితంపై పూర్తి నమ్మకం ఉందని నాగవంశీ చెప్పారు. అందుకే తమ బ్యానర్లో అత్యంత విజయవంతమైన అల వైకుంఠపురములో సినిమాతో విశ్వనాథ్ అండ్ సన్స్ను పోలుస్తున్నానని తెలిపారు. ఇది అహంకారంతో చేసిన వ్యాఖ్య కాదని, సినిమాపై ఉన్న విశ్వాసమే కారణమని స్పష్టం చేశారు. యువతకు మమితా బైజు పాత్ర బాగా కనెక్ట్ అవుతుందని, సూర్య, రాధికా శరత్కుమార్ మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అన్నారు.సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్పై కూడా నాగవంశీ సరదాగా స్పందించారు. తమ కాంబినేషన్లో ఇది మూడో సినిమా అని, ఈసారి కూడా హ్యాట్రిక్ హిట్ రావాలని ఆశిస్తున్నానని చెప్పారు.
Also Read:అపార్ట్మెంట్ లిఫ్ట్లో చిక్కుకుని మహిళ దుర్మరణం
ఈ చిత్రానికి ఆయన అందించిన నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. హీరోయిన్ మమితా బైజు కూడా ఈ వేడుకలో మాట్లాడారు. చిన్నప్పటి నుంచే సూర్యకు అభిమానినని, గతంలో ఆయనతో కలిసి నటించే అవకాశం చేజారినా ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఆ కల నెరవేరిందని చెప్పారు. సూర్యతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని, ఆయన ఎంతో వినయంగా ఉండే వ్యక్తి అని ప్రశంసించారు. కుటుంబ భావోద్వేగాలు, అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంలో సూర్య సరసన మమితా బైజు నటిస్తుండగా, రాధికా శరత్కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
