-హైదరాబాదులో పోలీసుల తీరుపై విమర్శలు
-ఇలా అయితే నైట్ ఎకానమీ ఎలా సాద్యం
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ :-
హైదరాబాద్ మహానగరంలో రాత్రిపూట ఇడ్లీ బండి నడుపుతున్నారని ఆరోపణలతో ఒక చిన్న వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయస్థానంలో హాజరు పరిచి రెండు రోజులు జైలు శిక్ష పడేలా చేయడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. వీధి వ్యాపారం చేసుకుంటూ నిజాయితీగా కష్టపడి జీవించే సామాన్యులను.. క్రిమినల్ నేరస్తుల్లా చూడడం.. వారిపై కేసులు పెట్టి వేధించడం పై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. పోలీస్ శాఖ తీరును తప్పు పడుతున్నాయి. మల్కాజ్గిరి పోలీసుల వైఖరి పై ఇప్పుడు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మల్కాజిగిరి పోలీసుల అతి..
హైదరాబాద్ వంటి మహా నగరాల్లో రాత్రిపూట చాలామంది వ్యాపారాలు చేస్తుంటారు. ఐటీ రంగంతో పాటు అన్ని రంగాలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తుంటారు. అటువంటి వారికి ఆహారం అందించే వారిపై నిబంధనల పేరుతో హింసించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అయితే దీనిని గొప్పగా భావించిన మల్కాజిగిరి పోలీసులు తమ అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తరువాత విమర్శలు రావడంతో దానిని డిలీట్ చేశారు. కానీ అప్పటికే అది వైరల్ అయింది. ఒకవైపు హైదరాబాదును 24 గంటల పాటు నడిచే గ్లోబల్ సిటీగా, నైట్ ఎకనామి కి నిలయంగా మారుస్తామని ప్రభుత్వం ప్రకటిస్తోంది. కానీ ఇప్పుడు అదే నైట్ ఎకనామి కి వెన్నెముకగా ఉండే చిన్న వ్యాపారులను వేధించడం.. ఆ ఆశయాలకు గొడ్డలి పెట్టిన మారిందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
వేలాదిమందికి తక్కువ ధరకు భోజనం..
హైదరాబాదులో వేలాదిమంది ఐటి, మల్టీ నేషనల్ కంపెనీల ఉద్యోగులు నైట్ షిఫ్ట్ లో పనిచేస్తుంటారు. వారికి అతి తక్కువ ధరలో ఆహారం అందించే చిన్న వ్యాపారులను క్రిమినల్స్ గా చిత్రీకరించడం తీవ్ర అన్యాయమని నేటిజెన్లు మండిపడుతున్నారు.. పెద్ద కార్పొరేట్ సంస్థలకు 24 గంటల నిర్వహణకు అనుమతులు ఇస్తూ.. వారికి సేవలు అందించే ఇడ్లీ, టిఫిన్ బండ్ల వ్యాపారులను మాత్రం జైలుకు పంపడం ఎంత మాత్రం సహేతుకం కాదు అని.. ఇది అభివృద్ధిని అణచివేయడమే అవుతోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. హైదరాబాద్ కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఈ టిఫిన్ బండ్ల వ్యాపారాన్ని నమ్ముకుంటూ వస్తున్నారు. అటువంటి వారి పొట్ట కొట్టడం తగదు అనే అభిప్రాయం వినిపిస్తోంది.
