క్రైం మిర్రర్ : రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో గురువారం రాత్రి హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఇంటి నుంచి వెళ్లిన ఘటన విషాదాంతమైంది. వ్యవసాయ బావి వద్ద జరిగిన ఈ ఘటనలో తల్లి, కుమార్తె ప్రాణాలు కోల్పోగా, ఐదేళ్ల కుమారుడు చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణాలతో బయటపడటం స్థానికులను కలచివేసింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా యాలాల మండలం సంగెం గ్రామానికి చెందిన సుధాకర్ ఉపాధి కోసం సుమారు 12 సంవత్సరాల క్రితం కుటుంబంతో కలిసి కొత్తపల్లి గ్రామానికి వలస వచ్చాడు. అక్కడే వ్యవసాయ కూలీగా పనిచేస్తూ భార్య వసంత (35), కుమార్తె నవ్య (15), కుమారుడు వరుణ్ (5)తో నివాసం ఉంటున్నాడు.
గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు జరిగినట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వసంత ఇద్దరు పిల్లలను వెంట తీసుకుని గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వసంత, నవ్య బావిలో పడి మృతి చెందారు.
అయితే బావిలో పడిన చిన్నారి వరుణ్ అక్కడ ఉన్న చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకుని సహాయం కోసం ఎదురుచూశాడు. విషయం తెలుసుకున్న తండ్రి సుధాకర్ వెంటనే అక్కడికి చేరుకుని స్థానికుల సహకారంతో బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. ప్రస్తుతం అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని సమాచారం.
సమాచారం అందుకున్న శంకర్పల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి కుటుంబ కలహాలు సహా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read : మహిళపై అసభ్య ప్రవర్తన.. యువకుడిని చెట్టుకు కట్టేసిన గ్రామస్థులు