భారత కరెన్సీ వ్యవస్థలో కీలక మార్పుకు రంగం సిద్ధమవుతోంది. నోట్ల నాణ్యతను మెరుగుపరచడం, వాటి వినియోగ కాలాన్ని పెంచే లక్ష్యంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. ప్రాథమికంగా రూ.10, రూ.20 విలువ కలిగిన నోట్లతో ఈ కొత్త విధానాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. 2027 నుంచి దశలవారీగా పాలిమర్ నోట్లను చలామణిలోకి తీసుకురావాలని ఆర్బీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం దేశంలో వినియోగంలో ఉన్న కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. నీరు, తేమ, చిరిగిపోవడం వంటి సమస్యలను ఇవి తట్టుకోగలవు. దీంతో నోట్ల ముద్రణ, భర్తీ ఖర్చులు తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. పాలిమర్ కరెన్సీ నోట్లు ఇప్పటికే పలు దేశాల్లో వినియోగంలో ఉన్నాయి. అధునాతన భద్రతా లక్షణాలు కలిగి ఉండటం వల్ల నకిలీ నోట్ల సమస్యను తగ్గించడంలో కూడా ఇవి ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
అయితే కొత్త నోట్ల ప్రవేశం తర్వాత కూడా ప్రస్తుత కాగితపు నోట్లు వెంటనే రద్దు కావు. రెండు రకాల నోట్లు కొంతకాలం పాటు చలామణిలో ఉండే అవకాశం ఉంది. ప్రజల వినియోగం, స్పందన ఆధారంగా భవిష్యత్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కరెన్సీ వ్యవస్థలో ఆధునిక మార్పులకు అనుగుణంగా ఆర్బీఐ తీసుకుంటున్న ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థలో మరో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.
also read: కొడుకు చదువు కోసం ప్రాణాలకు తెగించిన తండ్రి.. ఉద్ధృత నదిని భుజాలపై మోసుకుంటూ దాటిన వైనం