క్రైం మిర్రర్ : హైదరాబాద్లోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తతకు దారితీసిన ఘటనలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణల నేపథ్యంలో స్థానికులు అతనిపై దాడి చేసినట్లు సమాచారం. ప్రాథమిక వివరాల ప్రకారం.. అజీజ్ అహ్మద్ అనే వ్యక్తి ఓ మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడని స్థానికులు ఆరోపించారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆగ్రహానికి గురైన కొందరు స్థానికులు అతడిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో అజీజ్ అహ్మద్ తీవ్రంగా గాయపడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం గాయపడిన అజీజ్ అహ్మద్ను చికిత్స కోసం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న సమయంలో అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కుల్సుంపుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసభ్య ప్రవర్తన ఆరోపణలతో పాటు, వ్యక్తిపై జరిగిన దాడికి సంబంధించిన అంశాలపైనా విచారణ కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.
also read : ఇబ్రహీంపట్నంలో విషాదం.. హాస్టల్ భవనం పై నుంచి దూకి బీటెక్ విద్యార్థి మృతి