కర్ణాటక రాజధాని బెంగళూరులో మరో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యుల ముగ్గురిని హత్య చేసి చివరికి తాను కూడా ప్రాణాలు తీసుకున్న సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రశాంత్ (34) అనే వ్యక్తి కొట్టిగెపాళ్య ప్రాంతంలో నివసిస్తున్నాడు. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన అతను గత కొంతకాలంగా ఎలాంటి ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. పితృఆస్తిపై ఆధారపడి జీవనం సాగిస్తూ మద్యానికి బానిసగా మారినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. ముఖ్యంగా అతని తల్లి మంగళమ్మ పని చేయాలని ఒత్తిడి చేయడం వల్ల ఇద్దరి మధ్య విభేదాలు మరింత పెరిగాయి. ఈ రోజు ఉదయం కూడా ఇదే విషయంలో వాగ్వివాదం చోటుచేసుకుంది. కోపంతో అదుపు తప్పిన ప్రశాంత్ తన తల్లిపై దాడి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అతని మేనమామ సతీష్ అక్కడికి చేరుకుని ప్రశాంత్ను ప్రశ్నించడంతో వాగ్వివాదం తీవ్రరూపం దాల్చింది. ఆగ్రహంతో ఉన్న ప్రశాంత్ ఇంట్లో ఉన్న కత్తితో తల్లి మంగళమ్మను హత్య చేశాడు. అడ్డుకోవడానికి వచ్చిన నాయనమ్మ నంజమ్మతో పాటు మేనమామ సతీష్పైనా దాడి చేసి వారినీ చంపాడు.
వారి అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకుని ప్రశాంత్ను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో పోలీసులకు సమాచారం అందించారు. బయటపడే మార్గం లేకపోవడంతో ప్రశాంత్ ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్మార్టమ్ నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు శస్త్రచికిత్స – పదేళ్ల నొప్పికి చెక్, కుడి భుజానికి ఆపరేషన్ విజయవంతం