సినీ పరిశ్రమలో వర్కింగ్ అవర్స్పై కొనసాగుతున్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ వివాదంపై స్పందించింది. ముఖ్యంగా రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తానని గతంలో చెప్పిన దీపికా పదుకొనె నిర్ణయానికి తాను పూర్తి మద్దతు ఇస్తున్నానని తేల్చి చెప్పింది. ప్రస్తుతం కాజల్ నటించిన ‘ది ఇండియా స్టోరీ’ సినిమా జులై 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె వర్కింగ్ అవర్స్ గురించి మాట్లాడింది.
దీపికా తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదని కాజల్ చెప్పుకొచ్చింది. ఒక స్థాయికి చేరుకున్న తర్వాత వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాధాన్యం ఇవ్వడం సహజమేనన్నది. ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు పెరిగిన తర్వాత పని, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడం అవసరమని చెప్పుకొచ్చింది. కార్పొరేట్ రంగంలో ఉద్యోగులకు నిర్దిష్ట పని గంటలు ఉన్నప్పుడు, క్రమంగా ప్రొఫెషనల్ విధానంలో ముందుకెళ్తున్న సినిమా పరిశ్రమలో కూడా అలాంటి విధానాలపై చర్చ జరగడం తప్పుకాదన్నది. పని విషయంలో ఒకే విధమైన ప్రమాణాలు ఉండాలని, ఈ విషయంలో భిన్నమైన వైఖరి అవసరం లేదన్నది.
తాను తల్లిగా మారిన తర్వాత జీవితంలో ప్రాధాన్యతలు మారిపోయాయని.. అందుకే సినిమా ఒప్పందం చేసుకునే ముందే తన పని నిబంధనలను స్పష్టంగా చెబుతానని వివరించింది. ముఖ్యంగా ఆదివారం రోజున షూటింగ్ చేయనని, ఆ రోజంతా కుటుంబ సభ్యులతోనే గడపాలని ముందుగానే నిర్మాతలకు తెలియజేస్తానని వెల్లడించింది. దీపికా తీసుకున్న నిర్ణయాన్ని కాజల్ బహిరంగంగా సమర్థించడంతో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.