బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, ఆయన మాజీ భార్య సుసానే ఖాన్ విడాకులకు సంబంధించిన రూ.400 కోట్ల భరణం వార్తలపై తాజాగా కీలక స్పందన వచ్చింది. ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని సుసానే సోదరి, ప్రముఖ జ్యువెలరీ డిజైనర్ ఫరా ఖాన్ చెప్పింది. 2014లో హృతిక్, సుసానే అధికారికంగా విడిపోయిన సమయంలో సుసానే రూ.400 కోట్ల భరణం తీసుకున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. హృతిక్ కూడా ఆ మొత్తాన్ని చెల్లించారని అప్పట్లో అనేక కథనాలు వచ్చాయి. అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఫరా ఖాన్ అలీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
విడాకుల తర్వాత హృతిక్ నుంచి సుసానే భారీ మొత్తంలో డబ్బు తీసుకుందని వస్తున్న కామెంట్లు చూసినప్పుడల్లా బాధ కలుగుతుందని చెప్పారు. వాస్తవానికి సుసానే హృతిక్ నుంచి ఎలాంటి భరణం తీసుకోలేదని స్పష్టం చేశారు. తమ కుటుంబం విలువలకు ప్రాధాన్యం ఇచ్చే కుటుంబమని, డబ్బు కోసం ఎప్పుడూ ఎవరి మీదా ఆధారపడే స్వభావం తమకు లేదని చెప్పారు.
ఈ పుకార్లపై స్పందించి నిజం చెప్పాలని తాను సుసానేకి చాలాసార్లు సూచించినా, అలాంటి ప్రచారాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆమె భావిస్తుందని ఫరా తెలిపారు. ఇతరులు ఏమనుకున్నా తన జీవితంపై వాటి ప్రభావం ఉండదని సుసానే చెప్పేదని వెల్లడించారు. విడాకులు తీసుకున్నప్పటికీ హృతిక్, సుసానే ఇప్పటికీ మంచి స్నేహితులుగానే కొనసాగుతున్నారని ఫరా చెప్పారు. దీంతో చాలా కాలంగా వినిపిస్తున్న రూ.400 కోట్ల భరణం ప్రచారానికి ఆమె మరోసారి తెరదించినట్లైంది.