క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:-వాహనదారులకు ఇది కొంత నిరాశ కలిగించే వార్తే. ప్రైవేట్ ఇంధన సంస్థ ‘నయారా’ ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించినప్పటికీ, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మాత్రం ఇప్పట్లో ఆ దిశగా అడుగులు వేసే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం మరో రెండు నెలల వరకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం లేదని జాతీయ మీడియా వర్గాలు (NDTV) పేర్కొంటున్నాయి.
నయారా సంస్థ ధరలు తగ్గించడంతో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL), భారత్ పెట్రోలియం (BPCL) వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ధరలు తగ్గించాలన్న డిమాండ్ వినియోగదారుల నుంచి వ్యక్తమవుతోంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంస్థలు ధరలను తగ్గించేందుకు సుముఖంగా లేవని తెలుస్తోంది.
కారణం ఇదే:-
పశ్చిమాసియాలో ఇటీవల జరిగిన యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తీవ్రంగా హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఆ సమయంలో దేశీయంగా ఇంధన ధరలు పెంచకపోవడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు భారీ నష్టాలను చవిచూశాయి. ఆ యుద్ధ సమయంలో రోజుకు సుమారు రూ. 500 నుంచి రూ. 600 కోట్ల వరకు ఈ సంస్థలు నష్టపోయినట్లు సమాచారం.ఈ భారీ నష్టాలను భర్తీ చేసుకునేందుకు (లాస్ రికవరీ) ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అందువల్ల, పెరిగిన ధరలనే కనీసం మరో రెండు నెలల పాటు కొనసాగించాలని ఆ సంస్థలు భావిస్తున్నట్లు NDTV నివేదించింది. నష్టాల భారం తగ్గిన తర్వాతే ధరల తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.మొత్తం మీద, సామాన్యుడిపై ఇంధన భారం ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. రెండు నెలల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
విశాఖలో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల దుర్మరణం
సీఎం విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. రూ.35 కోట్ల భారీ డీల్ బహిర్గతం