క్రైమ్ మిర్రర్, జాతీయం : హిందూ వివాహ వ్యవస్థ, సంప్రదాయాలపై గుజరాత్ హైకోర్టు అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. హిందూ సంప్రదాయం ప్రకారం కేవలం వివాహాన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకున్నంత మాత్రాన అది పూర్తిస్థాయి పెళ్లి కిందకు రాదని, శాస్త్రోక్తంగా ఆచార వ్యవహారాలు పాటిస్తేనే దానికి అసలైన గుర్తింపు ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.పెళ్లి అంటే కేవలం పాటలు పాడుకోవడం, డ్యాన్సులు వేసుకునే ఒక సాధారణ వేడుక కాదని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
హిందూ వివాహంలో ‘సప్తపది’ (అగ్నిసాక్షిగా ఏడడుగులు వేయడం) వంటి సంప్రదాయాలు, ఆచారాలు ఎంతో పవిత్రమైనవని, వాటిని తప్పనిసరిగా అనుసరించాలని పేర్కొంది. ఈ ఆచారాలు లేకుండా కేవలం కాగితాలపై జరిగే రిజిస్ట్రేషన్ను హిందూ సంప్రదాయ వివాహంగా పరిగణించలేమని తేల్చి చెప్పింది.
కేసు నేపథ్యం ఇదీ..బ్రిటన్ (UK)లో స్థిరపడిన ఒక ప్రవాస భారతీయుడు దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తున్న క్రమంలో గుజరాత్ హైకోర్టు ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సదరు వ్యక్తితో తనకు కేవలం రిజిస్టర్ మ్యారేజ్ అయిందని, కాబట్టి చట్ట ప్రకారం తాము భార్యాభర్తలమేనని ఒక మహిళ కోర్టులో వాదించింది. అయితే, ఆమె వాదనను న్యాయస్థానం ఈ సందర్భంగా తప్పుబట్టింది. వివాహానికి సంబంధించిన ఆచారాలు, సంప్రదాయాలు పాటించనప్పుడు కేవలం రిజిస్ట్రేషన్ కాగితం చూపిస్తే సరిపోదని కోర్టు స్పష్టం చేసింది.