తాజాగా వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త యూజర్ నేమ్ ఫీచర్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఫీచర్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లో ఈ ఫీచర్ ను వెంటనే ప్రారంభించవద్దని వాట్సాప్ మాతృసంస్థ మెటాకు కేంద్రం సూచించింది. ఈ అంశంపై అన్ని వర్గాలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? యూజర్ల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ఏ విధమైన వ్యవస్థలను ఏర్పాటు చేశారు? వంటి వివరాలను మూడు రోజుల్లో అందించాలని మెటాను కేంద్రం ఆదేశించింది.
ఇటీవల మెటా ఈ యూజర్ నేమ్ ఫీచర్ ను ప్రకటించింది. దీని ప్రధాన ఉద్దేశం యూజర్ల వ్యక్తిగత గోప్యతను మరింత మెరుగుపరచడమేనని సంస్థ తెలిపింది. ప్రస్తుతం కొత్త వ్యక్తితో వాట్సాప్లో మాట్లాడాలంటే తప్పనిసరిగా ఫోన్ నంబర్ ఇవ్వాల్సి వస్తోంది. కానీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఫోన్ నంబర్కు బదులుగా ప్రత్యేక యూజర్నేమ్ను మాత్రమే షేర్ చేస్తే సరిపోతుంది. దీంతో వ్యక్తిగత మొబైల్ నంబర్ను అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు.
అయితే, ఈ ఫీచర్పై కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారత్ వంటి భారీ డిజిటల్ వినియోగదారులున్న దేశంలో ఇది కొత్త సవాళ్లకు దారి తీసే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఫేక్ అకౌంట్లు సృష్టించడం, ఆన్ లైన్ మోసాలు పెరగడం వంటి ప్రమాదాలు ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అలాగే మోసాలకు పాల్పడిన వ్యక్తులను గుర్తించడం కూడా కష్టతరమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ నంబర్ కు బదులుగా యూజర్ నేమ్ మాత్రమే కనిపిస్తే నిందితులను ట్రేస్ చేయడం మరింత కష్టంగా మారే అవకాశం ఉందంటున్నారు.
ఈ నేపథ్యంలో యూజర్ల భద్రత, గోప్యత, సైబర్ నేరాల నియంత్రణ లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా ముందుకు సాగుతోంది. మెటా ఇచ్చే వివరణలు, భద్రతా చర్యలపై స్పష్టత వచ్చిన తర్వాతే భారత్లో ఈ ఫీచర్ అమలుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.