క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : భవిష్యత్లో డబ్బుతో పనే ఉండదా.? చివరికి డబ్బు నిరుపయోగంగా మారుతుందా.? అంటే అవునన్న సమాధానాన్ని ఇస్తున్నారు ప్రపంచ కుబేరుడు, తొలి ట్రిలియనీర్ ఎలాన్ మస్క్. ప్రపంచంలోనే కోట్లాది రూపాయలకు అధిపతి అయిన మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. స్పేస్ ఎక్స్ ఐపీవో విజయవంతం కావడంతో ఈ మధ్యే ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఎక్పైప్రైజ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పీటర్ డియామాండిస్తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) రోబోలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మారుస్తాయని మస్క్ పేర్కొన్నారు. ఏఐ, రోబోలు నిరంతరం, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి చేస్తాయన్న మస్క్.. తద్వారా వస్తువుల ధరలు కూడా తగ్గిపోతాయన్నారు. చివరికి మనుషులు కూడా చేయడానికి పనులు దొరకని పరిస్థితి ఉత్పన్నమవుతుందన్నారు.
డబ్బు అవసరం అందుకే ఉండదు..
మస్క్ డబ్బు అవసరం ఉండదని చెప్పడానికి కీలక కారణాన్ని చెప్పారు. మనుషులు అవసరం టెక్నాలజీ వల్లఎప్పుడైతే తగ్గిపోతుందో.. ఉత్పత్తి ఖర్చులు గణనీయంగా తగ్గుతాయన్నారు. కార్మికుల అవసరం ఉండదని, వారికి వేతనాలు చెల్లించాల్సిన అవసరం కూడా రాదన్నారు. కాబట్టి, ఒక దశలో డబ్బులు అవసరం ఉండదని మస్క్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై ఇంటర్వ్యూ చేసిన పీటర్ డయామాండిస్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ అదెలా సాధ్యపడుతుందని ప్రశ్నించగా.. భవిష్యత్లో ఇది నిజమవుతుందంటూ మరోసారి ఘంటాపథంగా స్పష్టం చేశారు. భవిష్యత్లో ప్రజలు ఉద్యోగాలు ద్వారా సంపాదించకపోయినా జీవించగలిగేలా యూనివర్సల్ హై ఇన్కమ్ అనే వ్యవస్థ వస్తుందని గతంలోనే మస్క్ వెల్లడించారు. ఇందులో ప్రతి ఒక్కరికీ కనీస జీవనానికి సరిపడే ఆదాయం వస్తుందని, అవసరమైన వారికి ప్రభుత్వాలే డబ్బులు చెల్లించే రోజు కూడా వస్తుందని ఆయన వెల్లడించారు. ఆ వ్యాఖ్యలను సమర్థించేలా తాజాగా మస్క్ చేసిన కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మరి మస్క్ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా.? లేదా.?