Women’s T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు విజయంతో శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన తొలి మ్యాచ్లో అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన భారత్ 64 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్లో స్మృతి మంధాన, హర్మన్ప్రీత్ కౌర్, రిచా ఘోష్ రాణించగా.. బౌలింగ్లో దీప్తి శర్మ, శ్రీచరణి పాక్ బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు.
20 ఓవర్లలో 170 పరుగులు చేసిన భారత్
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన చక్కటి ఇన్నింగ్స్ ఆడుతూ 68 పరుగులు సాధించింది. ఆమె ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 36 పరుగులతో జట్టుకు అండగా నిలిచింది. చివర్లో రిచా ఘోష్ వేగంగా ఆడి 34 పరుగులు జోడించింది. దీంతో భారత్ పోరాడగలిగే స్కోరు నమోదు చేసింది.
మొదట దూకుడుగా ఆడినా..
171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ప్రారంభంలో కాస్త ధైర్యంగా కనిపించింది. ఓపెనర్లు మునీబా అలీ, ఫిరోజా కలిసి జట్టుకు మంచి ఆరంభం అందించారు. పవర్ప్లే ముగిసే సమయానికి పాక్ స్కోరు 52 పరుగులకు చేరింది. ఆ దశలో మ్యాచ్ ఆసక్తికరంగా కనిపించింది. అయితే భారత స్పిన్నర్లు రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా దీప్తి శర్మ తన అద్భుత బౌలింగ్తో మ్యాచ్ను భారత్ వైపు తిప్పింది. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ పాక్ బ్యాటింగ్ను కుదేలు చేసింది. మరోవైపు శ్రీచరణి కూడా కీలక వికెట్లు పడగొట్టి ఒత్తిడి పెంచింది. మునీబా అలీ 41 పరుగులతో పోరాడినా మిగతా బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. అలియా రియాజ్ 18 పరుగులు చేసింది. మిగిలిన వారు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా పాకిస్థాన్ జట్టు 17 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌట్ అయింది.
4 ఓవర్లు.. 10 పరుగులు.. 5 వికెట్లు
దీప్తి శర్మ 4 ఓవర్లలో కేవలం 10 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీసి కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసింది. శ్రీచరణి 3 వికెట్లు సాధించింది. ఈ అద్భుత ప్రదర్శనకు గాను దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.