క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ అత్యవసరంగా సమావేశమవుతోంది. జూన్ 11న ఢిల్లీలోని ఇందిరా భవన్లో ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్చార్జులు, పీసీసీ అధ్యక్షులు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరుకావాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఏఐసీసీ అత్యవసర సమావేశం ప్రధాన ఎజెండా ఏమిటనేది పార్టీ అధిష్ఠానం ఆ సర్క్యులర్లో పేర్కొనలేదు. అయితే మధ్యప్రదేశ్లో మీనాక్షి నటరాజన్ రాజ్యసభ్య నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తోసిపుచ్చిన అంశం ప్రధానంగా ఈ సమావేశంలో చర్చకు రానుందని, దీనికి సంబంధించి భవిష్యత్ కార్యచరణపై సమావేశంలో చర్చించనున్నారని తెలుస్తోంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో కాంగ్రెస్ ప్రతినిధి బృందం ప్రధాన ఎన్నికల కమిషనర్కు బుధవారంనాడు కలిసి ఫిర్యాదు చేసింది. తక్షణం చర్యలు తీసుకోవాలని కోరింది. ఇది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యని ఆరోపించింది. దీనిపై న్యాయపోరాటానికి కూడా కాంగ్రెస్ సిద్ధమవుతోంది. మరోవైపు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో రాజ్యసభ ఎన్నికల్లో మూడో అభ్యర్థిగా నిలబెట్టిన మహేశ్ కావత్ విజయంపై బీజేపీ ధీమాగా ఉంది.