హోర్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రంలో వాణిజ్య భద్రత ఎంతో కీలకమన్నారు భారత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్. ఈ ప్రాంతాల్లో వ్యాపార రవాణాకు ఎలాంటి అంతరాయం కలగకూడదని ఆయన స్పష్టం చేశారు. రష్యాలోని మాస్కోలో జరుగుతున్న అంతర్జాతీయ భద్రతా సదస్సులో పాల్గొన్న సందర్భంగా డోభాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి వద్దు!
ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని అజిత్ డోభాల్ సూచించారు. ముఖ్యంగా ఉగ్రవాద సమస్యపై దేశాలు ద్వంద్వ వైఖరి ప్రదర్శించకూడదని అన్నారు. ఉగ్రవాదాన్ని ఎక్కడ జరిగినా ఒకే విధంగా చూడాలని, ఈ విషయంలో అన్ని దేశాలు తమ విధానాలను పునఃసమీక్షించుకోవాలని అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థలు, వ్యవస్థల్లో మార్పులు అవసరమన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా ఈ సంస్థలు మరింత ప్రభావవంతంగా మారాలని సూచించారు. గ్లోబల్ సౌత్ దేశాలకు అంతర్జాతీయ వేదికలలో మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సరైన ప్రాతినిధ్యం లభిస్తే ప్రపంచ సమస్యల పరిష్కారంలో సమతుల్యత ఏర్పడుతుందని ఆయన అన్నారు.
ప్రాధాన్యత సంతరించుకున్న అజిత్ డోభాల్ వ్యాఖ్యలు
ఈ అంతర్జాతీయ భద్రతా సమావేశాన్ని రష్యన్ ఫెడరేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ సెర్గీ షోయిగూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. “బహు ధ్రువ ప్రపంచంలో అంతర్జాతీయ భద్రతా సవాళ్లు” అనే అంశంపై ఈ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా అజిత్ డోభాల్ రష్యా అధికారులతో ద్వైపాక్షిక సమావేశాల్లో కూడా పాల్గొననున్నారు. ఈ సమావేశాల్లో భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భద్రతా పరిస్థితులు మారుతున్న సమయంలో డోభాల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్య మార్గాల భద్రతపై భారత్ తన ఆందోళనను మరోసారి స్పష్టం చేసినట్టైంది.