క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్:- సోషల్ మీడియాలో తన ప్రత్యేకమైన మాటతీరుతో ఒక్కసారిగా వైరల్ అయి, తర్వాత సినిమాల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్న కుర్చీ తాత అలియాస్ మహమ్మద్ కాలా బాషా ఇక లేరు. బుధవారం హైదరాబాద్లో ఆయన కన్నుమూశారు. తీవ్రమైన ఎండలు, ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్నేళ్ల క్రితం ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన సమయంలో ఆయన చెప్పిన ఆ కుర్చీని మడతపెట్టి… అనే డైలాగ్ సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయింది. ఆ ఒక్క డైలాగ్తోనే కాలా బాషా రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఆ వీడియో లక్షల వ్యూస్ సాధించింది. అప్పటి నుంచి నెటిజన్లు ఆయన్ను ప్రేమగా కుర్చీ తాత అని పిలవడం ప్రారంభించారు.
ఈ క్రేజ్ను గుర్తించిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు ఎస్. థమన్ కలిసి గుంటూరు కారం సినిమాలో ఆ కుర్చీని మడతపెట్టి అనే పాటను రూపొందించారు. ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయింది. ముఖ్యంగా థియేటర్లలో ఈ పాటకు ప్రేక్షకులు చేసిన హంగామా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ పాటలో స్వయంగా కుర్చీ తాత కూడా కనిపించడం విశేషం. మహేష్ బాబు, శ్రీలీలతో కలిసి ఆయన స్క్రీన్ షేర్ చేసుకున్నారు. దీంతో ఆయనకు మరింత గుర్తింపు వచ్చింది.అయితే వ్యక్తిగతంగా కాలా బాషా కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో హైదరాబాద్లోని కృష్ణకాంత్ పార్క్ సమీపంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. స్థానికులు వెంటనే స్పందించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినా, ఆసుపత్రికి తరలించేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.కుర్చీ తాత మృతిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఒక సాధారణ వ్యక్తి తన మాటతీరుతో కోట్లాది మందిని నవ్వించి, సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారిన ఆయన ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుందని అభిమానులు భావోద్వేగ పోస్టులు పెడుతున్నారు.