భారత టెస్టు క్రికెట్ జట్టులో త్వరలోనే కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్తో పాటు వన్డే సిరీస్ కోసం గౌహతిలో జాతీయ సెలక్టర్లు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రిషభ్ పంత్ భవిష్యత్తు నాయకత్వ బాధ్యతలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. టెస్టు ఫార్మాట్లో భారత జట్టుకు ప్రధాన బలంగా నిలుస్తున్న పంత్ను వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి, అతడు పూర్తిగా బ్యాటింగ్పైనే దృష్టి పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. జట్టుకు మ్యాచ్ విన్నర్గా పేరొందిన పంత్పై అదనపు ఒత్తిడి తగ్గిస్తే అతడి సహజమైన ఆటతీరు తిరిగి కనిపిస్తుందని బీసీసీఐ భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ప్రస్తుతం ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న పంత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత రెండు సీజన్లుగా కెప్టెన్సీ ఒత్తిడి కారణంగా అతడి దూకుడు బ్యాటింగ్ మందగించిందనే అభిప్రాయం బలపడుతోంది. వ్యూహాత్మక నిర్ణయాల్లో కూడా పంత్ కొన్ని తప్పిదాలు చేసినట్లు బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. గత ఏడాది నవంబర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్లో శుభ్మన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో పంత్ జట్టును నడిపించాడు. అయితే ఆ మ్యాచ్లో అతడి కెప్టెన్సీ పెద్దగా ఆకట్టుకోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్యాటింగ్లో దూకుడుగా ఆడే సమయంలో నాయకత్వ బాధ్యతలు అతడిపై అదనపు మానసిక ఒత్తిడి పెంచుతున్నాయని భావిస్తున్నారు.
భారత క్రికెట్ బోర్డు మాత్రం పంత్ను అత్యంత కీలక ఆటగాడిగా పరిగణిస్తోంది. ఒంటరి పోరాటంతో మ్యాచ్ ఫలితాన్ని మార్చగలిగే సత్తా అతడికి ఉందని బీసీసీఐ నమ్ముతోంది. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్లో క్లిష్ట పరిస్థితుల్లో వేగంగా పరుగులు సాధించి మ్యాచ్ను మలుపుతిప్పే సామర్థ్యం పంత్ ప్రత్యేకతగా భావిస్తున్నారు. అయితే కెప్టెన్సీ వంటి అదనపు బాధ్యతలు ఇచ్చినప్పుడు బ్యాటింగ్లో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో అతడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడనే అభిప్రాయం సెలక్టర్లలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అతడిని ఒత్తిడి లేకుండా పూర్తిగా బ్యాటింగ్పైనే కేంద్రీకరించే దిశగా బీసీసీఐ ముందడుగు వేయబోతున్నట్లు సమాచారం.
ఇక వన్డే జట్టులో కూడా పంత్కు తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. కేఎల్ రాహుల్ తర్వాత రెండో వికెట్ కీపర్ స్థానానికి భారీ పోటీ నెలకొంది. సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్, ఇషాన్ కిషన్ వంటి యువ ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్లో ఉండటంతో పంత్ తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే బ్యాట్తో భారీ ప్రదర్శనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా 50 ఓవర్ల ఫార్మాట్లో స్థిరమైన ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం పంత్పై మరింత పెరిగిందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా వర్క్లోడ్పై కూడా సెలక్టర్లు కీలక చర్చలు జరపనున్నారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే బూమ్రా ఫిట్నెస్ పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం సమీక్షించనుంది. వైద్య బృందం అనుమతి ఇస్తే మాత్రమే అతడు ఆఫ్ఘనిస్తాన్తో జరిగే ఏకైక టెస్టులో ఆడే అవకాశముంది. అయితే వన్డే సిరీస్కు మాత్రం అతడికి పూర్తిగా విశ్రాంతి ఇవ్వాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ చిన్నపాటి శారీరక సమస్య ఉన్నా పూర్తి సిరీస్ నుంచే బూమ్రాకు విశ్రాంతి కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారత జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా కీలక ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గించి, వారి సహజ ఆటతీరును వెలికితీయడంపైనే బీసీసీఐ దృష్టి పెట్టింది. ముఖ్యంగా రిషభ్ పంత్ లాంటి దూకుడు ఆటగాడు స్వేచ్ఛగా ఆడితేనే జట్టుకు అత్యంత ఉపయోగకరంగా ఉంటాడని సెలక్టర్లు భావిస్తున్నారు. నాయకత్వ బాధ్యతల కంటే అతడు అందించే పరుగులే భారత జట్టుకు మరింత అవసరమని బోర్డు అంచనా వేస్తోంది. ఈ కీలక మార్పులపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
ALSO READ: అందమైన లవ్ లేక్.. చూడాలని ఉందా..?