క్రైమ్ మిర్రర్, సినిమా:- ‘ది రాజా సాబ్’ హీరోయిన్ మాళవికా మోహనన్ తాజాగా తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో అసౌకర్యకర పరిస్థితిని ఎదుర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన సమయంలో ఓ తమిళ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.మాళవికా మోహనన్కు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ గురించి ఓ జర్నలిస్ట్ ప్రశ్న అడిగారు. బయటకు సాధారణంగా కనిపించినా, ఆ ప్రశ్నలో వేరే అర్థం దాగి ఉండటంతో మాళవిక వెంటనే స్పందించారు. “విజయ్తో కలిసి త్రిష పలు ప్రాంతాలకు వెళ్తున్నారు.. ఆయనతో ఎలా ట్రావెల్ చేయాలో మీకు తెలుసా?” అంటూ జర్నలిస్ట్ ప్రశ్నించగా, దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని గుర్తించిన మాళవిక అసహనం వ్యక్తం చేశారు.
“మీరు నన్ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు?” అంటూ ఆమె అక్కడికక్కడే కౌంటర్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవడంతో ఈ అంశంపై మాళవిక మరోసారి స్పందించారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఆమె ఓ పోస్ట్ చేశారు.“తమిళ మీడియా, జర్నలిస్టుల పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ కొందరు సంచలనం కోసం ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. నాకు విజయ్ గత ఏడు సంవత్సరాలుగా తెలుసు. ఆయన మంచి స్నేహితుడు మాత్రమే. భవిష్యత్తులో నటీనటులను ప్రశ్నించేటప్పుడు గౌరవప్రదంగా వ్యవహరించాలి. విజ్ఞతతో ప్రశ్నలు అడగాలి” అని మాళవిక పేర్కొన్నారు.
విజయ్, త్రిష మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ఇటీవల సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ పలు కార్యక్రమాల్లో కలిసి కనిపించడం, వ్యక్తిగత విషయాలపై ప్రచారం జరగడం వల్ల ఈ అంశం తరచూ వార్తల్లో నిలుస్తోంది. అయితే అలాంటి విషయాలను ఇతర నటీనటుల ముందుకు తీసుకురావడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.మాళవికా మోహనన్, విజయ్ కలిసి గతంలో ‘మాస్టర్’ సినిమాలో నటించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం విజయ్ రాజకీయాల్లో బిజీగా ఉండగా, ఆయన వ్యక్తిగత జీవితం గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో మాళవికకు మద్దతుగా పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే సమయంలో మీడియా హద్దులు దాటకూడదని, వ్యక్తిగత విషయాలపై గౌరవం చూపాలని కామెంట్లు చేస్తున్నారు.