అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడం, రూపాయి విలువ క్షీణించడం దేశంలో ఇంధన రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 106 నుంచి 110 డాలర్ల మధ్య కొనసాగుతుండగా, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మార్చింది. ముఖ్యంగా ఇరాన్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాల మధ్య దేశవ్యాప్తంగా శుక్రవారం మే 15న పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచినప్పటికీ, ఇది కేవలం ప్రారంభమేనని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తే దేశంలో ఇంధన సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం కనిపిస్తోంది.
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రస్తుతం భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. తాజా ధరల పెంపుతో వాటి నష్టాల్లో కేవలం 10 శాతం మాత్రమే తగ్గిందని సమాచారం. ప్రస్తుతం పెట్రోల్ విక్రయాలపై లీటరుకు రూ.11 నుంచి రూ.20 వరకు, డీజిల్పై రూ.30 నుంచి రూ.39 వరకు నష్టాన్ని ఆయా సంస్థలు భరిస్తున్నాయి. దీనివల్ల రోజుకు సుమారు రూ.500 కోట్ల నుంచి రూ.1000 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉన్న త్రైమాసికంలో ఈ నష్టాలు రూ.1 లక్ష కోట్లను దాటే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. గత ఏడాది చమురు సంస్థలు నమోదు చేసిన లాభాలను కూడా ఈ నష్టాలు పూర్తిగా తుడిచిపెట్టే పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతి వ్యయం మరింత పెరగడం కూడా సంస్థలపై అదనపు భారంగా మారింది.
ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఇంధన ధరలను మరో 20 నుంచి 30 శాతం వరకు పెంచడం తప్పనిసరి అవుతుందని చమురు రంగ నిపుణులు భావిస్తున్నారు. అంటే భవిష్యత్తులో లీటరు పెట్రోల్, డీజిల్ ధరలపై మరో రూ.20 నుంచి రూ.30 వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఇంత భారీ భారాన్ని ఒకేసారి ప్రజలపై మోపకుండా దశలవారీగా ధరలు పెంచే అవకాశాలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం మంత్రి హరదీప్ సింగ్ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం కేవలం వాహనదారులకే పరిమితం కాకుండా అన్ని రంగాలపై పడనుంది. రవాణా వ్యయాలు పెరగడంతో కూరగాయలు, నిత్యావసర వస్తువులు, నిర్మాణ సామగ్రి, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. దీంతో ద్రవ్యోల్బణం మరింత పెరిగి సామాన్య ప్రజల కుటుంబ బడ్జెట్పై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించడం, ప్రజా రవాణా వ్యవస్థను ఎక్కువగా వినియోగించడం, అవసరం లేని ప్రయాణాలను తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు ప్రజలకు సూచిస్తున్నాయి.
ALSO READ: కేరళ స్పెషల్ బ్రేక్ఫాస్ట్.. కేవలం ఆవిరిపైనే చేస్తారట!